సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. పలు హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ తెలుగు నిర్మాత కన్నుమూశారు. ఆయన మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనమామ, నిర్మాత మురళీరాజు (70) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం ప్రాణాలు విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని భీమవరానికి చెందిన మురళీరాజు.. గతంలో నిర్మాతగా పలు సినిమాలు రూపొందించారు. ఆ తర్వాత పలు వ్యాపారాలు కూడా చేశారు. కాగా, మురళీరాజుకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన కుమారుడి పేరు మధు. కూతురి పేరు అంబికా.
మురళీరాజు కుమారుడు మధు నిర్మాతగా పలు చిత్రాలు తీశారు. ఆయన నిర్మించిన వాటిలో ‘గజినీ’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో మొత్తంగా 34 మూవీస్ ఉన్నాయి. మురళీరాజు మృతిపై ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు క్రిష్, ప్రొడ్యూసర్ బన్నీ వాసు తదితరులు మధురానగర్లోని మురళీరాజు ఇంటికి వెళ్లి ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా మురళీరాజు పార్థివదేహానికి నివాళులు అర్పించారు.