ప్యాన్ ఇండియా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ప్రియ శిష్యుడన్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరి మధ్యా అనుకోని కారణాల వల్ల గొడవలు జరిగాయి.
తెలుగు చలన చిత్ర నృత్య దర్శకుడు రాకేష్ మాస్టర్ ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం బోరబండలోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అయితే, రాకేష్ మాస్టర్ అంత్యక్రియలకు ఆయన శిష్యుడు శేఖర్ మాస్టర్ రాడని అందరూ భావించారు. కానీ, శేఖర్ మాస్టర్ తన గురువు కడచూపు కోసం వచ్చారు. దగ్గరుండి మరీ అంతిమ సంస్కారాలు జరిపించారు. ఎన్ని గొడవలు ఉన్నా తాను రాకేష్ మాస్టర్ ప్రియ శిష్యుడినని నిరూపించుకున్నారు. ఈ ఇద్దరి మధ్యా గొడవలు ఎందుకు జరిగాయన్న సంగతి పక్కన పెడితే.. రాకేష్ మాస్టర్కు శేఖర్ అంటే ఎంతో ప్రేమ.
తనకు ఎంత మంది శిష్యులు ఉన్నా శేఖర్ను ప్రత్యేకంగా చూసేవారు. ఈ విషయాలను స్వయంగా రాకేష్ మాస్టరే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రాకేష్ మాస్టర్.. శేఖర్ గురించి మాట్లాడుతూ.. ‘‘ నా తర్వాత నువ్వేరా డ్యాన్స్లో వారసుడివి అని శేఖర్తో చెప్పేవాడిని. షూటింగ్లో ఎవడైనా శేఖర్ను పక్కకు పెట్టి ఆ ప్లేసులో వస్తే.. ఇమిడయట్గా ఫైర్ అయిపోతా.. ‘ ఎవడ్రా నువ్వు. బోసుడీకే.. పో అవతలికి’ అనే వాడిని. శేఖర్ను ఫ్రంట్ లైన్లో నిల్చోబెట్టేవాడిని.
వేణు తొట్టంపూడి నటించిన ‘చిరునవ్వుతో’ సినిమా షూటింగ్ అప్పుడు శేఖర్ను వెనక్కు పంపించారు. నేను వేణు సార్ను అడిగి ముందుకు రప్పించాను. నేను కెమెరాలో కనిపించాలి. శేఖర్ను డ్యామినేట్ చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఎడిటర్లకు కూడా అదే చెప్పేవాడిని. శేఖర్ మూమెంటే కరెక్ట్ అని చెప్పేవాడిని. నేను శేఖర్ను బక్క అని పిలిచేవాడిని. పుట్టిన రోజు నాడు ఇద్దరం ఒకే డ్రెస్.. ఒకే ప్యాంట్స్ వేసుకునే వాళ్లం. ఆ ఫోటలన్నీ చూసి ఒక్కోసారి ఏడుస్తాను. వాడు నా తమ్ముడు.. నా కొడుకు.. నేనే శేఖర్.. శేఖరే నేను’’ అని అన్నారు.