మనిషి ఎదుగుదలను, పతనాన్ని నిర్ణయించేది కాలమే. ఆ కాలమే ఓ చరిత్రను లిఖిస్తుంది. ఆ చరిత్రలో ఎందరో గొప్పవాళ్ల పేర్లు సువర్ణాక్షరాలతో రాయబడతాయి. అలా చరిత్రలోకి ఎక్కాలి అంటే వ్యక్తిత్వానికి మించిన ఆయుధం లేదు. అలాంటి వ్యక్తిత్వంతోనే తెలుగు చిత్ర పరిశ్రమంలో తనకంటూ ఓ పేరును క్రియేట్ చేసుకున్నాడో వ్యక్తి. అలాంటి ఓ వ్యక్తి గురించే ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆయనే రాకేష్ మాస్టర్. ఈ పేరు వినగానే అందరికీ నవ్వు రావచ్చు. కానీ.. రాకేష్ మాస్టర్ అంటే.. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానెల్స్ లో చూస్తున్న సామాన్యమైన వ్యక్తి కాదు. మీరు అనుకునేంత తక్కువ స్థాయి అంతకన్నా ఆయనది కాదు. ప్రస్తుతం రాకేష్ మాస్టర్ చేస్తున్న తప్పు ఒక్కటే నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడం. ఇది ఆయనకు చిన్నతనం నుంచే ఉంది. తాజాగా ఇండియన్ మైఖెల్ జాక్సన్ గా పేరుగాంచిన ప్రభుదేవాకే సవాల్ విసిరిన రాకేష్ మాస్టర్ కు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
రాకేష్ మాస్టర్.. 1500 సినిమాలకు కొరియోగ్రఫీ.. టాలీవుడ్ లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లు అయిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లకు గురువు. స్టార్ హీరోలందరితో కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. 2020 సంవత్సరానికి గానూ గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుంచి సేవారంగంలో డాక్టర్ రేట్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాల్లో ఆయన గొప్పతనం తెలుస్తుంది. అయితే గత కొంత కాలంగా వివాదాస్పద ఇంటర్య్వూలు ఇస్తూ.. రాకేష్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఆర్జీవీ, శ్రీ రెడ్డి, బాలకృష్ణ, ఎన్టీఆర్ లాంటి వారిపై మాస్టర్ చేసిన విమర్శలు అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇక తన శిష్యుడు అయిన శేఖర్ మాస్టర్ పైన కూడా రాకేష్ మాస్టర్ తీవ్ర విమర్శలు చేశాడు. శేఖర్ మాస్టర్ కూడా పలు సందర్భాల్లో రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడిన విషయం మనందరికి తెలిసిందే.
అయితే ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్ లో ఇంటర్య్వూలు ఇచ్చే రాకేష్ మాస్టర్ వేరు.. గతంలో తెలుగు టెక్నీషియన్లు, డ్యాన్సర్ల కోసం పోరాడిన రాకేష్ మాస్టర్ వేరు. వెయిటర్ కు, డ్రైవర్ కు ఎవడైనా నో చెబుతాడు. కానీ మనకంటే పెద్ద వాడికి నో చెప్పిన వాడే గొప్పవాడు అవుతాడు అన్న డైలాగ్ అక్షరాల రాకేష్ మాస్టర్ కు సరిపోతుంది. అవకాశాలు ఇచ్చే వాళ్లకే సవాల్ విసరడం ధైర్యవంతుల లక్షణం.. కానీ ఇచ్చిన సవాల్ ను గెలవడం పోరాట యోధుల లక్షణం. అలాంటి మెండి పట్టుదల ఉంది కాబట్టే రాకేష్ మాస్టర్ ఆ స్థాయికి వెళ్లాడు. ఇక్కడ ఓ విషయం గురించి చెప్పుకోవాలి. అది ‘ఢీ’ డ్యాన్స్ షో ప్రారంభ రోజులు. ఆ షోకు జడ్జిలుగా తరుణ్ మాస్టర్, బృందా లాంటి మేటి కొరియోగ్రాఫర్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ షోకి ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా వచ్చారు.
ఆ రోజు ఢీ వేదికగా ప్రభుదేవాకు సవాల్ విసిరాడు రాకేష్ మాస్టర్. తెలుగు గురించి తెలిసిన వాళ్లే జడ్జిలుగా వ్యవహరించాలని, తెలుగు వాళ్లే వచ్చి ఈ షోలో పాల్గొని మన దమ్ము చూపించాలని రాకేష్ మాస్టర్ ఆ సందర్భంగా చెప్పుకొచ్చాడు. తెలుగు వాళ్లకు అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడు రాకేష్ మాస్టర్. తెలుగు డ్యాన్సర్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఢీ వేదికగా ప్రపంచానికి తెలియజేశాడు. ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా చలామని అవుతున్న చాలా మంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేశారన్నది కాదనలేని నిజం. ఇక్కడ మరో విషయం ఏంటంటే! ప్రభుదేవా అప్పటికే స్టార్ హీరోగా, కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న రోజుల్లోనే ఈ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించాడు రాకేష్ మాస్టర్.