ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. జల్సా, పోకిరి, చెన్నకేశవ రెడ్డి, ఒక్కడు చిత్రాలను మళ్లీ తెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కింది. హీరోల పుట్టిన రోజుల సందర్భంగా మరికొన్ని చిత్రాలు సైతం రీ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే వచ్చిన వసూళ్లను చారిటీలకు ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ లు తెలిపాయి. ఇప్పుడు ఇదే కోవలోకి చేరబోతున్నాడు ఆలిండియా సూపర్ స్టార్ రజినీకాంత్. సురేష్ కృష్ణ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం ‘బాబా’. ఈ చిత్రానికి రజినీనే కథ, కథనాలను సమకూర్చుకోవడం విశేషం. సూపర్ స్టార్ రజినీ పుట్టిన రోజును పురస్కరించుకుని డిసెంబర్ 12న బాబా చిత్రాన్ని మరిన్ని హంగులతో తెరపైకి తీసుకురావాలని చూస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
సూపర్ స్టార్ రజినీకాంత్.. యావత్ భారత సినీ ప్రపంచంలో ఓ ధృవ తార. తనదైన స్టైల్ తో బస్ కండక్టర్ నుంచి ఆలిండియా సూపర్ స్టార్ గా ఎదిగారు రజినీకాంత్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తనే సొంతంగా రాసుకున్న కథ ‘బాబా’ సినిమా. 2002లో వచ్చిన ఈ సినిమాకు బాష మూవీ డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. ఈ చిత్రం బాగా ఆడకపోవడానికి కారణం అప్పటి రాజకీయ పరిస్థితులు కూడా కారణంగా సినీ విశ్లేషకులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బాబా చిత్రాన్ని నేటి ఆధునిక టెక్నాలజీతో ఆధునీకరించి మళ్లీ విడుదల చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి.
అదీ కాక చిత్ర కథలో, పాటలను రీమిక్స్ చేసి, డాల్ఫీ సౌండ్ ద్వారా థియేటర్లకు తీసుకురానున్నట్లు సోమవారం ఓ ప్రకటనను సైతం విడుదల చేశారు చిత్ర యూనిట్. అయితే వచ్చే నెల డిసెంబర్ 12 సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ కు ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్త చక్కర్లు కొడుతోంది. బాబా సినిమాలో హీరోయిన్ గా మనీషా కోయిరాలా నటించారు. ఈ చిత్రానికి కెమెరామెన్ గా చోటా.కే. నాయుడు కాగా ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఇక తమ అభిమాన నటుడి సినిమా చాలా సంవత్సరాల తర్వాత తెరపైకి రానున్నడంతో ప్రేక్షకులు తెగ సంబంరపడిపోతున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.