ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు రఘు కుంచె తండ్రి జనవరి 17న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి లక్ష్మీ నారాయణరావు 90 ఏళ్ల వయసులో కాలం చేశారు. గత కొన్ని రోజులుగా వయో భార సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నారాయణరావు ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. జీవనోపాధి కోసం వ్యవసాయం చేసిన ఆయన.. స్థానికంగా ఉండే సాగునీటి సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. హోమియో వైద్యుడిగానూ సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక, తండ్రి మరణంపై రఘు కుంచె శుక్రవారం స్పందించారు.
ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. లక్ష్మీ నారాయణరావు చనిపోవటానికి కొన్ని గంటలు ముందు రఘు కుంచె తెచ్చిన కొత్త బట్టలు వేసుకున్నారట. ఫ్యామిలీతో ఉల్లాసంగానే గడిపారట. దూరంగా ఉన్నవాళ్ళను వీడియో కాల్లో పలకరించారట. మర్నాడు పొద్దున్నే లేచి స్నానం చేశారట. పూజ చేసిన అనంతరం అల్పాహారం తీసుకున్నారట. తన కిష్టమైన మడత కుర్చీలో వెనక్కి వాలి.. భగవద్గీత చదవటం మొదలుపెట్టారట. భగవద్గీత చదువుతూనే తుది శ్వాస విడిచారట.
ఏ రోజు ఎవ్వరినీ కొంచెం కూడా ఇబ్బంది పెట్టని తన తండ్రి, ఆఖరి క్షణాల్లో కూడా అలానే వెళ్లిపోయారని రఘు కుంచె అన్నారు. తన తండ్రిని చాలా మిస్ అవుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, నిన్న ప్రముఖ సీనియర్ నిర్మాత ఎ. సూర్య నారాయణ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం చనిపోయారు. మరణానికి కొన్ని నెలల ముందు నుంచే ఆయన బయటికి రావటంలేదు. ఇంట్లోనే ఉంటున్నారు. ఆఖరికి మనవరాలి పెళ్లి రిసెప్షన్కు సైతం ఆయన వెళ్లలేదు. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు.