పావలా శ్యామల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటి వరకు తెలుగులో సుమారు 300లకు పైగా సినిమాల్లో నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శ్యామల ప్రస్తుతం కడు బీదరికాన్ని అనుభవిస్తూ.. అత్యంత దయనీయ స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం అనారోగ్యం పాలైన శ్యామల కుమార్తెతో కలిసి.. అనాథాశ్రమంలో ఉంటుంది. ఒకప్పుడు శ్యామల పరిస్థితి తెలుసుకుని చిరంజీవి సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం చేశారు. ఆ డబ్బులు అయిపోయాయని.. ప్రస్తుతం చేతిలో చిల్ల గవ్వ లేక ఎంతో కష్టపడుతున్నామని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గోడు చెప్పుకుంది శ్యామల.
ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ..‘‘మా అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోకపోతే.. చిరంజీవి లక్ష రూపాయలు కట్టి.. నాకు మెంబర్షిప్ ఇప్పించారు. నా కుమార్తె అనారోగ్యం పాలైతే.. మరో 2 లక్షల రూపాయలిచ్చారు. అందరూ చేసిన సాయంతో ఇప్పటి వరకు నెట్టుకొచ్చాం. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎలాంటి బతుకుదెరువు లేదు.. ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. నేను, నా కుమార్తె ఇంత విషం తాగి చద్దామన్నా.. బయటకు వెళ్లి దాన్ని కొనుక్కొచ్చి తాగేంత శక్తి కూడా లేదు మాకు. అలా అని చావమని మాకు ఎవరు విషం తెచ్చి ఇవ్వలేరు కదా. ప్రస్తుతం చావడానికి కూడా శక్తి లేని స్థితిలో ఉన్నాం’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
‘‘డబ్బులేనప్పుడు.. ఉచిత అనాథాశ్రమంలో ఉండచ్చు కదా అని అంటున్నారు.. ఇప్పుడు ఉంటున్న అనాథాశ్రమంలో డబ్బులు కడితేనే మమ్మల్ని పట్టించుకోవడం లేదు.. సరిగా చూడటం లేదు. ఉదయం 11 అయితేనే గానీ పనమ్మాయి రాదు. అప్పటి వరకు నా కుమార్తెనే ఇబ్బంది పడుతుంది. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాక నన్ను చూసుకునేందుకు ఒక అమ్మాయిని నియమించారు. ఆమె నన్ను ఆపరేషన్ చేయించుకో అంది. డాక్టర్లు మాత్రం వద్దు.. మీ శరీరం తట్టుకోలేదు అన్నారు. దీంతో ఆమె తనకు సంబంధం లేదని.. మధ్యలోనే వదిలేసి వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత నేను బతికున్నానా? లేదా? అని కూడా ఎవరూ పట్టించుకోలేదంటూ’’ శ్యామల కంట తడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. సినీ ప్రముఖులు పావలా శ్యామలని ఆదుకోవాలని కోరుకుంటున్నారు.