సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు ‘తబలా ప్రసాద్’ శుక్రవారం (మార్చి 18న) ఉదయం తుదిశ్వాస విడిచారు. చిత్ర పరిశ్రమలో దాదాపు 7 దశాబ్దాలకు పైగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 4 తరాల సంగీత దర్శకులతో తబలా ప్రసాద్ పని చేశారు. ముఖ్యంగా ఆయన తబలా మ్యూజిక్ అందించిన ఎన్నో పాటలు సూపర్ హిట్లుగా నిలిచిపోయాయి.
బాలీవుడ్ లో ఆర్డి బర్మన్, సి.రామచంద్ర, లక్ష్మీకాంత్ ప్యారీలాల్, నవ్షత్, బప్పిలహరి లతోపాటు దక్షిణాది ఇండస్ట్రీలో స్క్రీన్ మ్యూజిషియన్ తిలక్ కెవిఎం, మెలోడీ కింగ్ ఎమ్ఎస్వి, మ్యాస్ట్రో ఇళయరాజా లాంటి చాలామంది పాటలకు ప్రసాద్ తబలా వాయించడం విశేషం. ఇక ఈ తరానికి సంబంధించి ప్రముఖ సంగీత దర్శకులు.. ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా, జివి ప్రకాష్లతో కలిసి 5 భాషల్లో సుమారు 2500 సినిమాలకు పనిచేసినట్లు సమాచారం.మొత్తంగా ఆయన కెరీర్ లో 60 వేల పాటలకు తబలా వాయించినట్లు తెలుస్తుంది. ఈయనకు భార్య కృష్ణవేణి, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు( రమణ, కుమార్) ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారులు కూడా సంగీత విద్వాంసులుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇదిలా ఉండగా.. చెన్నైలోని ఏవీఎం స్డూడియో సమీపంలో ఉన్న శ్మశానవాటికలో తబలా ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. తబలా ప్రసాద్ ఆకస్మిక మృతి పట్ల సినీ వర్గాలవారు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.