మెగా హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ముందు జాగ్రత్తగా వెంటిలేటర్పై ఉంచినట్లు తెలిపారు. భయపడాల్సింది ఏమీ లేదని వైద్యులు తెలిపారు. చింరజీవి కూడా అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదంపై పోలీసుల స్పందన ఎలా ఉందన్న దాని గురించి తెలుసుకుందాం.
సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి 7.45 గంటలకు జూబ్లిహిల్స్లోని రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చిబౌలికి బయల్దేరాడు. రాత్రి 7.58 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జి కి చేరుకున్నాడు. 8 గంటలకు కోహినూర్ హోటల్ దాటి.., ఐకియావైపు వెళ్తుండగా.. సరిగ్గా 8గంటల 5 సెకండ్లకు తేజ్ బైక్ స్కిడ్ అయి కిందపడిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో సాయిధరమ్ తేజ్ హెల్మెట్ ధరించే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కానీ, ఆ సమయంలో అతను సేఫ్టీ జాకెట్ వేసుకోలేదని స్పష్టం చేశారు. ఒక్కసారిగా రోడ్డుపై పడటంతో కుడి కన్ను, ఛాతీ, కడుపు, కుడి కాలు బొటన వేలికి గాయాలయ్యాయి.
శుక్రవారం రాత్రి 8.20 గంటలకు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థిలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును అంచనా వేశారు. చుట్టుపక్కలున్న ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. బైక్ స్కిడ్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. బైక్ను సీజ్ చేసి వెంటనే మాదాపూర్ పీఎస్కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ఇసుక, మట్టి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం 7.53 గంటల సమయంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సాయి ధరమ్ తేజ్పై పోలీస్ కేసు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కారణంపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అదే విధంగా జీహెచ్ఎంసీ అధికారులపై కూడా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డుపై ఇసుక, మట్టి ఉండటం కూడా ప్రమాదానికి కారణంగా భావించి జీహెచ్ఎంసీ అధికారులపై కేసు నమోదు చేశారు.
శనివారం ఉదయం 11 గంటల 44 నిమిషాలకు సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై పోలీసులు మరో అప్డేట్ని విడుదల చేశారు. వీకెండ్ పార్టీకి వెళ్తున్న సమయంలో సాయి ధరమ్ తేజ్కు ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్కు ఎలాంటి ప్రమాదం లేదని ఆరోగ్యం విషయంలో భయపడాల్సిన పనేమీ లేదని వైద్యులు తెలిపారు. మరికొన్ని గంటల్లోనే తేజ్ స్పృహలోకి వస్తాడని తెలుస్తోంది.