గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ‘మా’ ఎన్నికలు రాజకీయంగా వేడెక్కి పోతుంది. ఈ నేపథ్యంలో లోకల్ నాన్ లోకల్ అనే అంశం తెరపైకి వచ్చింది. దీనిపై ప్రకాశ్ రాజ్ – మంచు విష్ణు ప్యానెల్స్ మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఒకరిపై ఒకరు దారుణమైన ఆరోపణలు చేసుకుంటూ ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి సీనియర్ల మద్దతు కూడగట్టుకునేందుకు చాలానే ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ‘మా’ ఎన్నికల విషయంపై స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు మీడియాలో మాట్లాడుతూ.. ‘చిన్న, పెద్ద సినిమాలకు ప్రకాష్రాజ్ కావాలి. ఉత్తమ నటుడిగా ప్రకాష్రాజ్ను అంతా ఒప్పుకోవాల్సిందేనన్నారు. మా ఎన్నికల్లో సభ్యులకు డబ్బు ఆశ చూపిస్తున్నారు. మా ఎన్నికల్లో ఒక్కో ఓటరుకు రూ.10 వేలు ఇస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత మరికొంత నగదు ఇస్తామని చెబుతురన్నారట.. మా అసోసియేషన్ మసకబారబోతుంది. మా అసోసియేషన్ లో నాకు రెండో సారి చేయడానికి అవకాశాలు చాలా సార్లు వచ్చాయి.. కానీ ఆ బాధ్యత ఎంత కష్టమో ఒకసారి చూశాను. మళ్లీ నేను దాని జోలికి వెళ్లాలని భావించలేదు. అయితే మెగా ఫ్యామిలీ వంద శాతం ప్రకాశ్ రాజ్ కి మద్దతు ఇస్తుందని అన్నారు నాగబాబు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నారని అన్నారు.
ప్రకాశ్ రాజ్ లాంటి వాడు ఒక్కసారిగా కాదు మూడుసార్లు అధ్యక్షుడిగా ఉండాలన్నారు నాగబాబు.. ప్రకాశ్ రాజ్ ఉంటేనే మా అసోసియేషన్ బాగుపడుతుంది. ఇండస్ట్రీలో ప్రకాశ్ రాజ్ సినిమాకు రూ. కోటి తీసుకునే దమ్ము ఉన్నవాడు.. అలాంటిది అన్నీ వదులుకొని ‘మా’ కోసం వచ్చారు. ఇండస్ట్రీలో ప్రకాశ్ రాజ్ అంటే ఎవరో తెలియదా..? మరీ ఆయన పోటీ చేస్తున్నారంటే ఎందుకంత జలసీ, అసూయ వ్యక్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దీనిపై కోట్లు సంపాదిస్తారా.. ఆయనకు ఏమైనా బంగారు కిరీటం పెడతామా అన్నారు.
మా అధ్యక్ష పదవి ముళ్ల కిరీటం లాంటిది అని నేను చెప్పినా అయినా భరిస్తా అంటూ ముందుకు వచ్చారు అన్నారు. అలాంటి వారికి కదా మనం మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని అన్నారు. మంచు విష్ణును గెలిపించాలనే కంగారు మీకెందుకు..? తెలుగు వాళ్ల అందరు కలిసి తెలుగువాణ్ని ఎన్నుకుందామంటే మనోళ్లు వేరే చోట నటించడం లేదా.. కోట శ్రీనివాసరావు తమిళ, కన్నడలో నటించలేదా.. సంకుచిత ఆలోచనల నుంచి తెలుగు నటీనటులు బయటకు రావాలి. ప్రకాశ్ రాజ్ ని గెలిపించేందుకు వంద శాతం కృషి చేస్తానని అన్నారు.