Mahesh Babu: మహేష్ బాబు.. ఈయనో వెండితెర ‘‘శ్రీమంతుడు’’. తనకు ఎంతో చేస్తున్న సినిమాకు, తన సినిమాలను అభిమానిస్తున్న జనాలకు ఏదో చేయాలనుకునే తత్వం ఆయనది. తన సినిమాలతో ప్రజలకు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్ని కూడా అందిస్తున్నారు. తాను చేసే ప్రతీ సినిమాలో ఓ మెసేజ్తో ప్రజలకు స్పూర్తిగా నిలుస్తున్నారు. ఏకంగా.. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును ప్రభావితం చేసే మాధ్యమంగా సినిమాను మలిచారు. కేవలం కమర్శియాలిటీకి మాత్రమే పరిమితం కాకుండా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో భారీ హిట్లను సొంతం చేసుకుంటున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట సినిమాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ సినిమాల ప్రభావం సమాజంపై బాగానే పడింది. ఈ సినిమాల స్పూర్తితో సమాజానికి ఏదో ఒక మంచి చేసిన వారు చాలా మందే ఉన్నారు.
శ్రీమంతుడు :
‘‘ఊరు మనకి చాలా ఇచ్చింది. తిరిగివ్వకపోతే లావైపోతాం’’ అన్న థీమ్తో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా చూసి తెలంగాణలోని కామారెడ్డికి చెందిన సుభాష్రెడ్డి అనే కాంట్రాక్టర్ స్పూర్తి పొందారు. తన గ్రామంలో రూ.12కోట్లతో ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు.
భరత్ అనే నేను :
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమా తెలంగాణ మంత్రి కేటీఆర్కు బాగా నచ్చింది. గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపు థీమ్ను అద్భుతంగా ఉందంటూ పొగిడారు. సీఎం కేసీఆర్ కూడా లోకల్ గవర్నన్స్ను తీసుకురావటానికి పని చేస్తున్నట్లు చెప్పారు.
మహర్షి :
అంతరించిపోతున్న వ్యవసాయాన్ని బ్రతికించటానికి ‘‘మహర్షి’’ చేసిన ప్రయత్నం మరిచిపోలేని. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో వీకెండ్ ఫార్మింగ్ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సినిమాను చూసిన చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీకెండ్ ఫార్మింగ్ను చేయటం మొదలుపెట్టారు. అంతేకాదు! కొంతమంది అపార్ట్మెంట్ వాసులు నేరుగా జనం నుంచి ఆహారపదార్ధాలను కొనటం మొదలుపెట్టారు.
సర్కారు వారి పాట :
మహేష్ తాజా చిత్రం ‘‘సర్కారు వారి పాట’’… బ్యాంకులు లోన్ రికవరీ విషయంలో సంపన్నులు, సామాన్యులు అన్న తేడాలు చూడకుడదన్న నేపథ్యంతో తెరకెక్కింది. ఈ సినిమా ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును ప్రభావితం చేసింది. సుప్రీం కోర్టు తన తాజా తీర్పులో సర్కారు వారి పాట థీమ్ని వెల్లడించి రైతులకు ఊరటనిచ్చింది. రైతుల నుంచి లోన్ లు రికవరీ చేయాలంటూ ఓ బ్యాంకు వేసిన పిటీషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సదరు బ్యాంక్కు.. `సర్కారు వారి పాట`లో చూపించిన విధంగా.. “పెద్ద చేపలను పట్టుకున్న తరువాతే రైతుల జోలికి వెళ్లండి. ఇలాంటి పిటిషన్ల వల్ల రైతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయి” అని జస్టీస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఇలా తాను తీసే ప్రతీ సినిమాతో ఏదో ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తూ సినిమాలకు కూడా సామాజిక బాధ్యత ఉందని మహేష్ నిరూపిస్తున్నారు. ప్రతీ సినిమాలో మెసేజ్ను జొప్పించి, జనాల్ని మెప్పిస్తున్నారు. మరి, మహేష్ బాబు సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Supreme Court: ముందు పెద్దచేపల సంగతి చూడండి: సుప్రీం కోర్టు సంచనల తీర్పు