సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రిస్మస్ సందర్బంగా సోషల్ మీడియాలో పెట్టిన శుభాకాంక్షల పోస్టు పై సినీనటి మాధవీలత వివాదాస్పద కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారని.. ఆయన పోస్ట్ చేసిన క్రిస్మస్ శుభాకాంక్షల పోస్ట్ కూడా అలాగే ఉందంటూ మాధవీలత సోషల్ మీడియాలో విమర్శించింది.
పవన్ కళ్యాణ్ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. జనసేన సోషల్ మీడియా ఖాతాల్లో వివిధ భాషల్లో పోస్టు చేశారు. ఆ పోస్ట్ పై పవన్ అభిమాని అంటూ చెప్పుకునే మాధవీలత స్పందించి.. ‘పవన్ కళ్యాణ్ గారు క్రిస్మస్ విషెస్ చెప్పండి. నమ్మినవారికి శుభాకాంక్షలు చెప్పండి మంచిది. మానవాళికి.. లాంటి పెద్దమాటలు ఎందుకు? మీ పోస్ట్ మతమార్పిడిలను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది. బైబిల్ ని బోధించనక్కర్లేదు. రెస్పెక్ట్ ఇద్దాం అంతవరకే. మీరు చెప్పిన విషెస్ తప్ప మీరు రాసిన కంటెంట్ నాకు నచ్చలేదు. సర్వ ప్రాణుల పట్ల అని ఏసు చెప్పలేదు. ఆయన చెప్పారని నేనూ మొన్నటిదాకా మీలాగే నమ్మాను.
మీ పేజీని మెయింటైన్ చేస్తున్నవాళ్లు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకోవడం మంచిది. మొన్న మీరు కూడా బైబిల్ గురించి గొప్పగా చెప్పారు. అంత గొప్పేంలేదు. మీరు కూడా మతమార్పిళ్లకు కారణం అవ్వొద్దు. చాలా బాధగా ఉంది నాకు. మీ పోస్టులో విషెస్ కంటే మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నట్లు ఉంది. ఒక హిందువుగా మీ పోస్టు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని ఆమె తన ఫేస్ బుక్ పోస్టులో విమర్శలు గుప్పించింది. ఈ అంశం పై ఓ వీడియో కూడా పెట్టింది. ప్రస్తుతం మాధవీలత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఆమె పోస్ట్ పై పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి మాధవి పోస్ట్ ఎలాంటి చర్చలకు దారితీస్తుందో..! మరి మాధవీలత పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.