సెలబ్రిటీలకు సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది. వీటిల్లో చాలా వరకు తప్పుడు వార్తలే ఉంటాయి. ఇక తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుకు సంబంధించి ఇలాంటి పేక్ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఏ వార్త నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో చాలా వరకు పుకార్లే ఉంటాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించి ఇలాంటి ఫేక్ వార్తలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తాయి. సెలబ్రిటీల పెళ్లి, ప్రేమ విషయాలతో పాటు.. ఓ అడుగు ముందుకు వేసి.. వారు చనిపోయారు.. వారు తీవ్ర అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలకు గురయ్యారంటూ తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. చాలా మంది వ్యూస్ కోసం.. సెలబ్రిటీలకు సంబంధించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారు. దారుణం ఏంటంటే.. బతికున్న వారిని కూడా చనిపోయారంటూ చిత్రీకరిస్తారు. ఇక సదరు సెలబ్రిటీలు తెర మీదకు వచ్చి.. బాబోయే మేం చావలేదు.. మమ్మల్ని చంపకండి అని మొర పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. తాజాగా ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావుకు సంబంధించి ఇలాంటి తప్పుడు వార్తే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఆయన మృతి చెందారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిపై ఆయన స్పందిస్తూ.. వీడియో విడుదల చేశారు.
తాను మృతి చెందానంటూ వస్తోన్న వార్తలను కోటా శ్రీనివాస రావు ఖండించారు. తాను బతికే ఉన్నానంటూ ఓ వీడియో విడుదల చేశారు. ప్రసుత్తం ఇది వైరలవుతోంది. వీడియోలో కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘అందరికి నమాస్కారం. ప్రేక్షకులందరికి ఉగాది శుభాకాంక్షలు. నేను ఇలా మీ ముందుకు ఎందుకు వచ్చానంటే.. ఎవరో సోషల్ మీడియాలో నేను మృతి చెందానంటూ వార్తలు పోస్ట్ చేశారంట. నాకు ఆ విషయం తెలియదు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో నేను రేపు పండగ కదా.. దాని గురించి ఇంట్లో వాళ్లతో చర్చిస్తున్నాను. ఇంతలో వరుస పెట్టి ఫోన్లు రావడం మొదలయ్యాయి. నేనే దాదాపు 50 ఫోన్లు మాట్లాడాను. మా కుర్రాళ్లు మిగతా ఫోన్లు మాట్లాడారు. ఆశ్చర్యం ఏంటంటే.. పోలీసులు కూడా మా ఇంటికి వచ్చారు’’ అని చెప్పుకొచ్చారు.
‘‘వాళ్లు నన్ను చూసి ఆశ్చర్యంతో ఏంటి సార్.. మీ గురించి సోషల్ మీడియాలో వార్తలు చూసి.. పెద్ద మనిషి కదా.. చాలా మంది వస్తారు.. సెక్యురిటీ ఇద్దామని వచ్చాం. ఏంటి ఇదంతా అన్నారు. నేనేం చెప్పను సార్.. మీరే వీళ్లకు గట్టిగా సమాధానం చెప్పాలి.. ఎవరైనా భయస్తులు ఉంటే గుండె ఆగి చనిపోతారు అని పోలీసులను కోరాను. ప్రజలు కూడా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వార్తలను నమ్మవద్దు. ఇలాంటి తప్పుడు వార్తల మీద ప్రజలు గట్టిగా రియాక్ట్ అయితేనే వారికి బుద్ధి వస్తోంది. ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి చెండాలపు పనులు చాలా ఉన్నాయి. ఇది అక్కర లేదు. మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు’’ అని తెలిపారు.
ఈ వార్తపై కోటా అభిమానులు, నెటిజనులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక గొప్ప వ్యక్తి గురించి ఇలాంటి దరిద్రపు వార్తలు ప్రచారం చేస్తారా.. మీరు అసలు మనుషులేనా.. కడుపుకు అన్నం తింటున్నారా.. గడి తింటున్నారా.. మీకిదేం పోయే కాలం అంటూ ఓ రేంజ్లో ఫైరవుతున్నారు. మరి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారికి బుద్ధి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
నాటకాల మీద ఆసక్తితో ఆ రంగంలోకి వచ్చాడు కోటా శ్రీనివాసరావు. క్రాంతి కుమార్ దర్శకత్వంలో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలో కేవలం విలన్ పాత్రలే పోషించి.. ప్రేక్షకులను భయపెట్టాడు. ఇక తెర మీద కోటా-బాబు మోహన్ల కాంబినేషన్ సూపర్ హిట్టు. ఎన్నో చిత్రాల్లో వీరిద్దరి కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అహ నా పెళ్ళంట సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర ఆయన కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలానే ఆ నలుగురు సినిమాలో ఆయన పాత్ర ఎంతో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నారు. వయో భారం కారణంగా సినిమాలు తగ్గించారు. శ్రీనివాసరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు లో ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు.
కోట శ్రీనివాసరావు మృతి చెందాడంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన నటుడు!#KotaSrinivasaRao #Tollywood #SumanTV pic.twitter.com/2Xp2Ts9NU2
— SumanTV (@SumanTvOfficial) March 21, 2023