ఎన్టీఆర్ అంటే పేరు కాదు ఎనర్జీ. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాతో తన రేంజుని పెంచుకున్న తారక్.. త్వరలో కొత్త సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నాడు. చాలారోజుల నుంచి అప్డేట్ ఎప్పుడా ఎప్పుడా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు అన్ని విషయాలు చెప్పేశారు. తాజాగా ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన.. చాలా నార్మల్ గానే కనిపించాడు. సుమ, బ్రహ్మాజీలపై పంచులు వేస్తూ కనిపించారు. అంతవరకు బాగానే ఉంది కానీ తన ఆరోగ్యం బాగోలేదని స్వయంగా ఎన్టీఆర్ చెప్పడంతో ఫ్యాన్స్ ని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొన్నిరోజుల క్రితం లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తారకరత్న ఆస్పత్రి పాలయ్యారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు తారకరత్న చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉండగానే.. తాజాగా ఎన్టీఆర్ తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడం పలు సందేహాలకు తావిచ్చింది. అలానే కొత్త సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు లేనిపోని భయాలని రేకెత్తించింది. ఎందుకంటే తారక్ మాట్లాడుతూ.. ‘నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు. అయినా మీ అందరినీ చూడటానికి వచ్చాను. ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. బాడీ పెయిన్స్ ఉన్నాయి.’ అని చెప్పాడు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజైన దగ్గర నుంచి ప్రమోషన్స్, ఈవెంట్స్ అని మొన్నమొన్నటి వరకు తిరుగుతూనే ఉన్నారు. కొన్నిరోజుల ముందు ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుల కోసం టీమ్ అంతా కలిసి అమెరికా వెళ్లొచ్చారు. అంతకు ముందు జపాన్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి నగరాలు తిరిగి వచ్చారు. ఇలా గ్యాప్ లేకుండా తారక్ అక్కడికి ఇక్కడికీ వెళ్తూనే ఉన్నారు. ఇది కాదన్నట్లు మరోవైపు నుంచి ‘NTR 30’ అప్డేట్ అంటూ ఒత్తిడి. ఇలా తీరిక లేని పనితో పాటు వాతావరణ మార్పుల వల్ల తారక్ ఒంట్లో కాస్త నలతగా ఉంది తప్పితే ఫ్యాన్స్ భయపడాల్సినంత ఏం లేదని తెలుస్తోంది. తారక్ చెప్పినట్లు మరికొన్నిరోజుల్లో కొత్త సినిమా పూజా కార్యక్రమంతోపాటు షూటింగ్ కు హాజరవుతారు.