శ్రీనివాస మూర్తి.. సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఈయన ఒక ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన శుక్రవారం చెన్నైలోని ఆయన నివాసంలో రెండో అంతస్తు మీద నుంచి కింద పడి తుది శ్వాస విడిచారు. ఆయన ఎంతో మంది సూపర్ స్టార్లకు డబ్బింగ్ చెప్పారు. చాలా మంది తమిళ ఆర్టిస్టులకు తెలుగులో డబ్బింగ్ చెప్పేది శ్రీనివాస మూర్తినే. చాలాకాలం శ్రీనివాస మూర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా శ్రీనివాస మూర్తిని ఇంటర్వ్యూ చేసి ఆయనను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. అప్పటి వరకు ఆయన తెలుగు వాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు. శ్రీనివాస మూర్తి గురించి, ఆయన డబ్బింగ్ చెప్పిన సినిమాలు, ఆయన కెరీర్ కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను మరోసారి చూద్దాం.
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి తెలుగువారే. ఆయన చెన్నైలో సెటిల్ అయ్యారు. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ ఏవీఎన్ మూర్తి కుమారుడే శ్రీనివాస మూర్తి. ప్లే బ్యాక్ సింగర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, జింగిల్స్ రైటర్, జింగిల్స్ సింగర్ గా ఏవీఎన్ మూర్తి ఎంతో ఫేమస్. డబ్బింగ్ లో శ్రీనివాస మూర్తికి మొత్తం 30 ఏళ్ల అనుభవం ఉంది. అయితే ఆయన మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించారు. తన మూడున్నర ఏళ్ల వయసులో ఓ బన్నీల యాడ్ లో నటించారు. తర్వాత 15 ఏళ్ల వయసు వరకు మోడల్ గానే కొనసాగారు. చివరిగా గుమ్మడి, రమాప్రభ గారితో కలిసి ఓ కమర్షియల్ లో నటించారు.
ఇంక డబ్బింగ్ కెరీర్ విషయానికి వస్తే.. కాలేజీ రోజుల్లో నాన్న గారితో కలిసి కమర్షియల్స్ కి వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా మెల్లగా డబ్బింగ్ లోకి వచ్చేశారు. 1993లో తన డబ్బింగ్ కెరీర్ ని ప్రారంభించారు. శ్రీనివాస మూర్తిని డబ్బింగ్ ఆర్టిస్టుగా రైటర్ శ్రీరామ కృష్ణ పరిచయం చేశారు. దొంగ దొంగ అనే సినిమాలో ప్రసాంత్ పాత్రకి శ్రీనివాస మూర్తి తొలిసారి డబ్బింగ్ చెప్పాడు. చిన్న చిన్న పాత్రలకు గతంలో చెప్పినా. దొంగ దొంగ సినిమానే హీరో పాత్రకి చెప్పిన తొలి డబ్బింగ్. అప్పటి నుంచి ఆయన కెరీర్ అప్రతిహితంగా కొనసాగింది. తిరుగులేని ఓ గొప్ప డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎదిగారు.
ఆయన ఏ ఏ హీరోలకి డబ్బింగ్ చెప్పారు అని చూసే కంటే.. ఎవరికి డబ్బింగ్ చెప్పలేదు అని లెక్క పెట్టడం చాలా సులభం. ఎందుకంటే ఏబీసీడీల్లో R, K లెటర్స్ మినహా మిగిలిన అందరు హీరోలకు డబ్బింగ్ చెప్పాను అంటారు. అంటే రజినీ కాంత్, కమల్ హాసన్ లకు తప్ప దాదాపుగా అందరు స్టార్లకు డబ్బింగ్ చెప్పారు. ఇంక స్టార్ హీరోలతో ఆయనకున్న అనుబంధం ఎంతో గొప్పగా ఉంటుంది. గజిని సినిమాతో ఆయన సూర్యాకి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. “యముడు సినిమా రిలీజ్ అయిన సమయంలో మధ్యాహ్నం కాల్ చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. నా యాక్టింగ్ నీ వాయిస్ యాడ్ అయ్యాక.. తమిళ్ కంటో తెలుగే డామినేటింగ్ గా ఉంది” అని అభినందించారంట.
హీరో సూర్యాతో శ్రీనివాస మూర్తికి మంచి అనుబంధం ఉంది. ఆయన అన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్తూ తెలుగు ప్రేక్షకులకు అది డబ్బింగ్ చిత్రం అనే భావన రాకుండా కృషి చేసింది శ్రీనివాస మూర్తినే. 24 వంటి సినిమాల్లో మూడు పాత్రలకు ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా డబ్బింగ్ చెప్పారు అంటే ఆయన ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అజిత్ తో కూడా శ్రీనివాస మూర్తికి మంచి రిలేషన్ ఉండేది. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో అజిత్ చిన్న క్యామియో రోల్ చేశారు. దానికి బాంబే వాళ్లు వేరే వారితో డబ్బింగ్ అనుకున్నారంట. అయితే అజిత్ అందుకు అంగీకరించలేదు. నాకు శ్రీనివాస మూర్తి చెప్తున్నారు. ఆయనతోనే చెప్పించండి అన్నారంట. అప్పుడు శ్రీనివాస మూర్తి బాంబే వెళ్లి డబ్బింగ్ చెప్పి వచ్చారంట.
హీరో రాజశేఖర్ కు కూడా శ్రీనివాస మూర్తి పన్నెండేళ్లు డబ్బింగ్ చెప్పారు. మా ఆయన బంగారం సినిమా నుంచి రాజశేఖర్ కు డబ్బింగ్ స్టార్ట్ చేశారు. అంతక ముందు దాదాపు 30 ఏళ్లు సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు. తర్వాత ఆయన చెప్పకపోవడంతో శ్రీనివాస మూర్తికి ఆవకాశం ఇచ్చారు. అప్పుడు ఆయన ఒక్కసారిగా శ్రీనివాస మూర్తి వాయిస్ వింటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరు. నేను సాయి కుమార్ అన్నయ్య వాయిస్ తన వాయిస్ తో మిక్స్ చేసి డబ్బింగ్ చెప్తానని ఒక చిన్న ఇన్ పుట్ ఇచ్చారంట. అందుకు అందరూ ఒప్పుకోవడంతో మా ఆయన బంగారం సినిమా డబ్బింగ్ కాస్త సాయికుమార్ వాయిస్ ని పోలి ఉంటుంది.
ఆ సమయంలో సాయి కుమార్ ఆ విషయంపై అభినందించారంట. “నేను ఓ రోజు ప్రసాద్ ల్యాబ్స్ కి వెళ్లాను. అక్కడ సాయికుమార్ అన్నయ్య కలిశారు. మా ఆయన బంగారం సినిమా చూశాను. నువ్వు నన్ను అంత దగ్గరగా ఎప్పుడ అబ్జర్వ్ చేశావ్ అని అడిగారు. ఎందుకంటే వెన్నెల అని పిలవడం, డైలాగులు చెప్పడం దాదాపు ఆయన చెప్పిన విధంగానే ఉన్నాయని మెచ్చుకున్నారు. చాలా అద్భుతంగా చెప్పావంటూ అభినందించారు. తర్వాత సాయికుమార్ గారు రాజశేఖర్ గారికి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. చివర్లో కల్కికి నేనే డబ్బింగ్ చేప్పాను” అంటూ రాజశేఖర్, సాయికుమార్ తో ఉన్న అనుంబంధాన్ని పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి కూడా శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్పారు. చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాకి కన్నడ, తమిళ్ లో మొదట శ్రీనివాస మూర్తే డబ్బింగ్ చెప్పారంట. అయితే తమిళ్ మాత్రం అరవింద స్వామి వచ్చి చరణ్ ని రిక్వెస్ట్ చేసి డబ్బింగ్ తాను చెబుతానన్నారంట. దాంతో చరణ్ కాదనలేక డబ్బింగ్ చెప్పిన తర్వాత మళ్లీ అరవింద్ స్వామితో చెప్పించారంట. సైరా నరసింహారెడ్డికి కన్నడలో శ్రీనివాస మూర్తినే డబ్బింగ్ చెప్పారు. ఇలా ఎన్నో గొప్ప సినిమాలకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్పారు. ఇంతటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్, పైగా తెలుగు వాడిని కోల్పోవడంపై సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.