కొందరు సెలబ్రిటీలు సమయం, సందర్భం లేకుండా.. ఏ మాత్రం ఆలోచన చేయకుండా.. నోటికి ఏం తోస్తే.. అది మాట్లాడి విమర్శల పాలవుతారు. తాజాగా తారకరత్న మృతి నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ కూడా అలానే ఆలోచనారహితంగా ట్వీట్ చేసి ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఆ వివరాలు.
ప్రాణమున్నంత వరకే బంధువులు, మిత్రులు, శత్రువులు. ప్రాణం పోయిన తర్వాత.. ఆ మనిషికి ఈ లోకంతో సంబంధం తెగి పోతుంది. మిత్రులు, శత్రువులు అని తేడా ఉండదు. అందరూ ఒక్కటే. అందుకే శత్రువుగా భావించిన వ్యక్తి మరణించాడని తెలిస్తే అయ్యో పాపం అంటాం.. అన్ని రోజుల శత్రుత్వాన్ని మర్చిపోయి.. ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుతాం. ఇక రాజకీయాల్లో ఇలాంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పార్టీల పరంగా మాత్రమే నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటారు. కానీ వారి వ్యక్తిగత జీవితాల్లో.. నేతల మధ్య మంచి సంబంధాలే ఉంటాయి.. ఉండాలి కూడా. అప్పుడే ఆరోగ్యకరమైన రాజకీయ వాతావారణ పరిస్థితులు ఉంటాయి.
తాజాగా తారకరత్న మృతి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. పార్టీలకతీతంగా నేతలు ఆయనకు సంతాపం తెలిపారు. బాలకృష్ణ, విజయసాయిరెడ్డిలను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కూడా కొందరు అవాకులు చెవాకులు పేలి.. విమర్శల పాలవుతారు. తాజాగా బండ్ల గణేష్ ఇలానే అభాసుపాలయ్యాడు. ఆ వివరాలు..
నందమూరి తారకరత్న మరణంతో నందమూరి కుటుంబం, టీడీపీ, టాలీవుడ్లో కూడా తీవ్ర విషాదంలో ఉంది. ఇక తారకరత్న కుటుంబానికి ఇటు టీడీపీతోనే కాక.. వైసీపీతోను విడదీయరాని బంధం ఉంది. ఎలా అంటే తారకరత్న భార్య సతీమణి అలేఖ్యా రెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి దగ్గరి బంధువు. ఇక తారకరత్న మృతి నేపథ్యంలో విజయసాయిరెడ్డి దగ్గరుండి అన్నీ పనులు చూసుకుంటున్నారు. ఇక తారకరత్న మృతి నేపథ్యంలో.. ఆయనకు నివాళులు అర్పించేందుకు చంద్రబాబు కుటుంబ సమేతంగా వచ్చారు. తారకరత్నకు నివాళులర్పించిన తర్వాత.. చంద్రబాబు, విజయసాయి రెడ్డితో కాసేపు మాట్లాడారు.
ఇక వీరిద్దరూ ఇలా మాట్లాడుకోవడంపై నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. విజయసాయిరెడ్డి, చంద్రబాబు ఫోటోను ట్వీట్ చేసిన బండ్ల గణేష్.. ‘‘నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను. అవసరం వస్తే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాను.. అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం ఇది.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి..’’ అంటూ కామెంట్ చేశాడు. ఇది వైరలవ్వడమే కాక.. బండ్ల గణేష్ని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు నెటిజనులు.
బండ్ల గణేష్ ట్వీట్పై నెటిజనులు మండిపడుతున్నారు. రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు.. ఇక్కడ చంద్రబాబు, విజయసాయి కలిసిన సందర్భం, సమయం వేరు. ఇంటికొచ్చిన వ్యక్తి శత్రువు నైనా సరే మంచినీళ్ళు ఇచ్చి పలకరించే సంప్రదాయం మనది. ఇలాంటి కష్ట సమయంలో పార్టీలను పక్కన పెట్టి.. వారంతా తారకరత్న కుటుంబానికి అండగా నిలిచారు. దీన్ని కూడా రాజకీయం చేయాలా.. జనాలు మరి అంత పిచ్చి వాళ్లు కారు.. మధ్యలో నీ పిచ్చి వాగుడు ఏంటి.. ‘నువ్వు నీ పిచ్చి ట్వీట్స్’ అంటూ విరుచుకుపడుతున్నారు నెటిజనులు. ఆ మాత్రం అర్థం చేసుకునే సంస్కారం కూడా లేదా నీకు అంటూ మండి పడుతున్నారు. బండ్లన్నా.. రాజకీయాల్లో సైద్ధాంతికంగా విభేదాలు ఉండవచ్చు, వ్యక్తిగతంగా కాదు,పాలిటిక్స్ లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరంటూ హిత బోధ చేస్తున్నారు.
నందమూరి తారకరత్నకు నివాళులర్పించడానికి వచ్చిన వారితో విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు. చంద్రబాబు, బాలకృష్ణలతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్తో కూడా మాట్లాడారు. ఇలాంటి సందర్భాన్ని కూడా తప్పు పట్టడం ఏంటి అని నెటిజనులు ప్రశంసిస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం.
అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!! pic.twitter.com/ENGbX3oRP5— BANDLA GANESH. (@ganeshbandla) February 20, 2023