చిత్తూరు- రష్మి గౌతమ్.. ఈ జబర్దస్త్ యాంకర్ మరియు సినిమా నటికి ఎంత క్రేజ్ ఉందో అందిరికి తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షోను హోస్ట్ చేస్తూనే, అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తోంది రష్మి. ఇక రష్మి అందం, అభినయానికి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. ఎక్కడైనా బయట రష్మి కనిపిస్తే అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడిపోతుంటారు.
తాజాగా చిత్తూరుకు వచ్చిన రష్మిని చూసేందుకు ఆమె ఫ్యాన్స్ పోటీపడ్డారు. సోమవారం చిత్తూరు నగరంలో యాంకర్ రష్మి సందడి చేసింది. స్థానిక చర్చి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ను రష్మి ప్రారంభించారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రష్మీని చూసేందుకు జనం చర్చి వీధికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం సందడిగా మారిపోయింది.
యాంకర్ రష్మీని చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడడంతో వారిని అదుపుచేయడం షాపింగ్ మాల్ సిబ్బందికి సాధ్యం కాలేదు. ఇంకేముందు షాపింగ్ మాల్ దగ్గర కాసేపు తోపులాట జరిగింది. అభిమానుల అరుపులు, కేకలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొంత మంది ఆకతాయిలు రష్మిని మీదికి దూసుకుని వచ్చేందుకు ప్రయత్నించారు.
ఓ దశలో ఆ ఆకతాయిలు రష్మిని తాకేందుకు ప్రయత్నించారు. దీంతో రష్మి వందలాది జనం మధ్యలో ఇరుక్కుపోయింది. కానీ రష్మి మాత్రం ఎక్కడా అసహనానికి గురికాలేదు. చెరగని తిరునవ్వుతోనే ఆమె అభిమానులకు సర్దిచెప్పారు. జనం గోల మధ్య నుంచే షాపింగ్ మాల్ లోకి అడుగుపెట్టిన రష్మి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించింది.