సాధారణంగా సీక్వెల్ అంటే ప్రేక్షకులు ముందే ఓ అంచనాకు వచ్చేస్తారు. తొలి భాగంతో పోల్చి చూస్తుంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా సరే.. ఆ సినిమా బోక్క బోర్లా పడటం గ్యారంటీ. ‘బాహుబలి’ సీక్వెల్ తప్పించి.. తెలుగులో ఆ స్థాయిలో హిట్ సినిమాలు పెద్దగా రాలేదు! కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన ‘కార్తికేయ 2’ మాత్రం దాన్ని బ్రేక్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ రూట్ లో మరో సినిమా రికార్డులు తిరగరాసేలా కనిపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. యువహీరో అడివి శేష్ కి తెలుగులో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. తక్కువ బడ్జెట్ తో మంచి థ్రిల్లర్స్ తీస్తాడు. మనోడు నటించాడంటేనే ఆ చిత్రంలో ఏదో స్పెషాలిటీ కచ్చితంగా ఉంటుందని ప్రేక్షకులు పక్కాగా ఫిక్సయిపోతారు. క్షణం, గూఢచారి, ఎవరు లాంటి సినిమాలే అందుకు ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక ఈ ఏడాది ‘మేజర్’ అనే బయోపిక్ తో థియేటర్స్ లోకి వచ్చిన శేష్… థ్రిల్లర్సే కాదు దేశభక్తి సినిమాలతోనూ హిట్ కొడతానని ప్రూవ్ చేశాడు.
ఇక మళ్లీ తనకు అచ్చొచ్చిన థ్రిల్లర్ జానర్ సినిమాతో త్వరలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. తాజాగా ‘హిట్ 2’ టీజర్ రిలీజ్ చేయగా.. ఇది డ్యామ్ షూర్ హిట్ అనిపిస్తోంది! విశ్వక్ సేన్ హీరోగా చేసిన ‘హిట్’ ఫస్ట్ పార్ట్ అమ్మాయి మిస్సింగ్ అనే కాన్సెప్ట్ తో తీసి హిట్ కొట్టారు. ఇక రెండో పార్ట్ స్టోరీ మొత్తం ఓ అమ్మాయిని అతి దారుణంగా నరికిన చంపిన కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఉండనుందని తెలుస్తోంది. వైజాగ్ నేపథ్యంగా తీసిన ఈ మూవీ కూడా ఆడియెన్స్ కి థ్రిల్ ఇవ్వడం పక్కా అని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.
ఇందులో శేష్ మేనరిజమ్, ఆటిట్యూడ్ లాంటివి చూస్తుంటే ఏదో కొత్తగా ట్రై చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో హీరోయిన్ గా చేసిన మీనాక్షి చౌదరి కూడా శేష్ కి కరెక్ట్ జోడీ అనిపిస్తోంది. డైరెక్టర్ శైలేష్ కొలను కూడా.. ‘హిట్’ అనేది యూనివర్స్ అని చెప్పాడు. దీన్నిబట్టి చూస్తుంటే.. ఈ సినిమా క్లైమాక్స్ లో శేష్ తో పాటు విశ్వక్ సేన్ కనిపించినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చూడాలి మరి ‘హిట్ 2’ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో. డిసెంబరు 2న.. ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.