సాధారణంగా శనిదోషం అనేది అన్నిటికంటే పెద్దదైన దోషంగా అందరూ భావిస్తూ ఉంటారు. ఒక రోజున తన ప్రభావం ఎలా ఉంటుందో చూపించి రెండో రోజున వదిలేస్తే ఇంతగా శనిదేవుడికి ఎవరూ భయపడుతూ ఉండేవాళ్లు కాదు. ఏడేళ్ల పాటు ఏకధాటిగా ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు కాబట్టి అంతా హడలెత్తి పోతుంటారు. శనిదేవుడి ప్రభావం నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడటానికి శనివారంతో కూడిన త్రయోదశి రోజున శనిదేవుడిని పూజిస్తూ ఉంటారు. శని త్రయోదశి రోజున ఆయన అనుగ్రహం సంపాదించడం తేలిక అని తెలియగానే ఒక మార్గమైతే ఉందికదా అని అందరూ తేలికగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. శనిదేవుడు కొలువుదీరిన క్షేత్రాలను దర్శించి ఆయనకి తైలాభిషేకాలు నిర్వహిస్తుంటారు. నువ్వులు నల్లని వస్త్రాలు ఇనుపమేకులు దానంగా ఇస్తూ ఉంటారు.
శనిత్రయోదశికి సంబంధించిన పూజలో రెండు ముఖ్యమైన నియమాలను పాటించవలసి ఉంటుందని శాస్త్రం చెబుతోంది. త్రయోదశి రోజున ముందుగా పరమశివుడిని ఆరాధించాలి. ఆ స్వామి ఆలయానికి చేరుకొని రుద్రాభిషేకాలు జరిపించాలి. ఆ తరువాతే శని దేవుడికి అభిషేకాదులు నిర్వహించాలి. శివుడిని పూజించకుండా శనిదేవుడికి చేసే అభిషేకం పరిపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వదనేది మొదటి నియమంగా కనిపిస్తుంది.
శనిదానం అనే విషయాన్నీ ముందుగా బ్రాహ్మణులకు చెప్పి ఇవ్వాలి. ముందుగా చెబితే దానంగా గ్రహించరని భావించి, స్వయం పాకమని చెప్పి ఆ బియ్యంలో ఇనుపమేకును ఉంచి ఇవ్వడం మరో పాపానికి కారణమవుతుంది. బ్రాహ్మణుడు ఇష్టపూర్వకంగా శని దానాన్ని గ్రహించినప్పుడు మాత్రమే ఆ దోషం నుంచి ఉపశమనం లభిస్తుందనేది రెండవ నియమంగా చెప్పబడుతోంది.
మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి: