కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అండగా నిలవాలి! ఆపదల్లో ఉన్నవారిని పోలీసు వ్యవస్థ కాపాడాలి. కానీ.. కృష్ణారావు దంపతుల విషయంలో ఈ రెండూ జరగలేదు. కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డ ఆ నిరుపేదలకు ప్రభుత్వం ఏ రకంగానూ అండగా నిలవలేదు. గతి లేక ఫుట్పాత్పై క్షణక్షణ గండంగా జీవిస్తున్న దంపతులను దుర్మార్గుల బారి నుంచి ఏ వ్యవస్థా కాపాడలేకపోయింది. అలాంటి అభాగ్యులు ప్రస్తుతం సమాజంలో ఎందరో ఉన్నారు. తమను ఆదుకుని అండగా నిలిచే ఆపన్నహస్తాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కష్టాల కడలిఅంటే కన్నీటి వరద అంటే ఆ దంపతులదేనేమో! ఉన్న ఊర్లో అన్నీ కోల్పోయి అప్పులు మిగిలి పట్నమొచ్చి బతికి అద్దె చెల్లించే స్థోమత లేక ఫుట్పాత్ మీదే ఓ పక్కన పడివుండి జీవనోపాధి నెట్టుకొస్తున్న ఆ దంపతులకు స్వేచ్ఛను కూడా పోకిరీలు ఇవ్వలేదు. భర్తను కొట్టి దాతలిచ్చిన పైసలు దోచుకుంటూ భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించారు. భార్యను వారి వేధింపుల నుంచి కాపాడుకునేందుకు ఆ భర్త నిద్రలేని రాత్రులు గడిపేవాడు. మరికొన్ని రోజులు గడిస్తే ఆ దంపతులు ఏమైపోయేవారో!? అయితే వారి కష్టాలను చూసి ఓ సామాన్యుడి మనసు చలించింది. ఆ ఇద్దరినీ తన వెంట ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే చోటు కల్పించి తమ ఇంట్లో వాళ్ల మాదిరిగానే చూసుకుంటున్నాడు! రోడ్డుపడిన ఆ అభాగ్యులు వరంగల్ జిల్లాకు చెందిన డ్రైవర్ కృష్ణారావు దంపతులైతే వారిని కష్టాల కడలి నుంచి గట్టెక్కించింది ఇమ్రాన్ అనే యువకుడు. కృష్ణారావు దంపతులు ఏడాదిగా బేగంపేటలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.
కృష్ణారావు ఓ స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేసేవాడు. కరోనా కారణంగా ఆ ఉపాధి పోయింది. ఇంటి అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఖాళీ చేయించాడు. దీంతో దంపతులు రోడ్డున పడ్డారు. ఇటీవల లాక్డౌన్ విధించిన నాటి నుంచి చిలకలగూడలోని ఓ ప్రైవేట్ స్కూల్ సమీపంలోని ఫుట్పాత్పై భార్యాభర్తలు ఉంటున్నారు. ఈనెల 13న నిరుపేదలకు ఆహారపొట్లాలను పంపిణీ చేసిన ఇమ్రాన్ అనే యువకుడు వీరిని చూశారు. నిర్భాగ్యులకు అండగా నిలవడం ఇమ్రాన్కు కొత్తేమీ కాదు. ఆయనది సికింద్రాబాద్. జంతు ప్రేమికుడు, కష్టాల్లో ఉన్నవారికి ఉన్నంతలో సాయం చేస్తారు. ఇమ్రాన్తో కృష్ణారావు తన గోడు వెల్లబోసుకున్నాడు. తనకు తిండి కాకుండా పనిప్పించాలని, ఎక్కడైనా ఉండేందుకు వసతి కల్పించాలని వేడుకున్నాడు. కృష్ణారావుకు దిగులు పడొద్దని చెప్పిన ఇమ్రాన్, తన వద్ద ఉన్న ఆహార ప్యాకెట్లతో పాటు జేబులో ఉన్న రూ. 2వేలు ఇచ్చి వెళ్లిపోయారు. మర్నాడు ఉదయం ఇమ్రాన్ వెళ్లి చూసే సరికి కృష్ణారావు తల ఉబ్బిపోయి ముఖంపై గాయాలతో ఏడుస్తూ కనిపించాడు. ఏం జరిగిందని ఇమ్రాన్ ప్రశ్నించగా కొంతమంది పోకిరీలు వచ్చి తనను కొట్టి తన వద్ద ఉన్న డబ్బు లాక్కెళ్లారని, తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారని చెప్పాడు. వెంటనే ఇమ్రాన్ ఆ దంపతులను తన ఇంటికి తీసుకెళ్లి ఓ పక్కన గది కేటాయించారు. వారికి రేషన్ సరుకులు ఇప్పించి వండుకునేందుకు స్టవ్ ఇచ్చారు. తన యూట్యూబ్ ఛానల్ పరేషాన్ బాయ్’’లో ఈ దంపతుల కష్టాలను ప్రసారం చేయగా ఆ వీడియో వైరల్గా మారింది. ఆ దంపతులకు సా యం చేయడానికి వేలమంది ముందుకొస్తున్నారు. దీంతో ఇమ్రాన్ను నెటిజన్లు పొగడుతున్నారు.