కొంతమందికి ప్రతిభ ఉంటే డబ్బుండదు, కొంతమందికి డబ్బుంటే ప్రతిభ ఉండదు. డబ్బు ఉండి ప్రతిభ లేకపోయినా ఏదో రకంగా బతికేయచ్చు. కానీ ప్రతిభ ఉండి డబ్బు లేకపోతే మాత్రం అది వారి జీవితాలే కాదు సమాజం కూడా వెనకబడిపోవడానికి కారణమవుతుంది. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా చదువులో ప్రతిభ చూపించేవారికి ఆర్ధిక ప్రోత్సాహం ఉండాలి. అందుకే ప్రభుత్వాలు ప్రతిభ ఉండి ఆర్ధికంగా వెనకబడి ఉన్న వారి కోసం స్కాలర్ షిప్ లు అందిస్తున్నాయి. ఆర్థిక వైకల్యం వల్ల ఉన్నత చదువులు చదివే స్థోమత లేక ఆగిపోయిన వారి కలలను ముందుకు తీసుకెళ్లేలా కేంద్రం ప్రోత్సాహం అందిస్తోంది.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఏదైనా యూజీలో మొదటి ఏడాది కోర్సులో చేరిన విద్యార్థులకు.. ‘ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్’ పథకం పేరిట స్కాలర్ షిప్ లు ఇస్తుంది. సెంట్రల్ సెక్టార్ స్కాలర్ షిప్ స్కీం కింద కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి స్కాలర్ షిప్ లు ప్రొవైడ్ చేస్తుంది. సీనియర్ సెకండరీ/ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ చూపించిన విద్యార్థులను స్కాలర్ షిప్ కి ఎంపిక చేస్తారు. ప్రతిభ ఆధారంగా ఉన్నత చదువులు చదువుకునేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. ఈ స్కాలర్ షిప్ కి ఏదైనా యూజీ లేదా ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మొదటి సంవత్సరంలో చేరిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి దరఖాస్తు చేసుకుంటే యూజీ నుంచి పీజీ వరకూ 5 ఏళ్ల పాటు స్కాలర్ షిప్ లు పొందవచ్చు.
బీటెక్ లాంటి నాలుగేళ్ళ డిగ్రీ కోర్సులకి కూడా స్కాలర్ షిప్ లు చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. సాధారణ డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్ పేజీలు చదివే విద్యార్థులకు ఏడాదికి 12 వేలు చొప్పున మొదటి మూడేళ్లు విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఆ తర్వాత పీజీలో చేరిన తర్వాత ఏడాదికి 20 వేలు చొప్పున రెండేళ్లు జమ చేస్తుంది. బీటెక్ విద్యార్థులకు 4వ ఏడాదికి గాను 20 వేలు జమ చేస్తుంది. రాష్ట్రాల వారీగా స్కాలర్ షిప్ లను విభజించారు. 18 నుంచి 25 ఏళ్ల వయసున్న విద్యార్థులను ఎంపిక చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల్లో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పరిగణలోకి తీసుకుని స్కాలర్ షిప్ లను నిర్ణయిస్తారు. రాష్ట్రాల వారీగా కేటాయించిన స్కాలర్ షిప్స్ లో 50 శాతం అమ్మాయిలకు కేటాయిస్తారు. సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్ విద్యార్థులను 3:2:1 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. రిజర్వేషన్ల వారీగా ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 5 శాతం స్కాలర్ షిప్ లు అందజేస్తారు.