దేశంలో 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్లు ఉన్నారని చెబుతుంటారు పెద్దలు. ఒక్కో దేవత లేదా దేవుళ్లకు ఒక్కో ఇతిహాస గాధ, ఇతర ఆధ్యాత్మికత కథలతో ముడిపడి ఉంటాయి. వాటికంటూ ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. మహిమలు ఉన్నాయి.
భారత్ తొలి నుండి హిందూ దేవాలయాలకు ప్రసిద్ధి గాంచింది. గ్రామ దేవత నుండి చారిత్రాత్మకత కలిగిన దేవాలయాలు అనేకం ఈ దేశంలో నెలవై ఉన్నాయి. మొత్తం 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్లు ఉన్నారని చెబుతుంటారు పెద్దలు. ఒక్కో దేవత లేదా దేవుళ్లకు ఒక్కో ఇతిహాస గాధ, ఇతర ఆధ్యాత్మికత కథలతో ముడిపడి ఉంటాయి. వాటికంటూ ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. మహిమలు ఉన్నాయి. ఆ గుడికి వెళితే పాపాలు పోతాయని, లేదా ఎప్పటి నుండో వెంటాడుతున్న రోగాలు మటుమాయం అవుతాయని చెబుతుంటారు. అటువంటి దేవాలయాల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే శివాలయం కూడా ఒకటి. ఇంతకు ఆ శివాలయం ఎక్కడుందంటే..?
దేశంలోని అతి పురాతన శివాలయాల్లో ఒకటి బుద్వా మహాదేవ్. బీహార్లోని భోజ్పూర్ జిల్లాలోని అరా నగరంలో ఈ శివాలయం ఉంది. ఈ గుడికి మహా భారతానికి సంబంధం ఉందని స్థానికులు భావిస్తుంటారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ శివుడిని పూజించేవారని ప్రతీతి. మధ్యయుగంలో, రాజా భోజ్ బుద్వా మహాదేవ్ ఆలయంలో పూజలు నిర్వహించేవారని నమ్ముతారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో స్థాపించిన శివలింగం కాలక్రమేణా పొడవుగా పెరుగుతుందని విస్తృతంగా స్థానికులు నమ్ముతుంటారు. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం.. శివలింగం గతంలో చాలా చిన్నదిగా ఉండేదని, కానీ ఇప్పుడు అది 4 అడుగుల ఎత్తుకు పెరిగిందని చెబుతున్నారు.
అలాగే ఆలయ పూజారి మహంత్ అజిత్ మిశ్రా కూడా ఇదే చెబుతున్నారు. తన పూర్వీకులు తరతరాలుగా ఆలయానికి ప్రధాన పూజారులుగా ఉన్నారని, శివలింగం ఎత్తు పెరగడం అందరూ చూశారని తెలిపారు. అంతేకాదూ.. ఈ శివలింగం నుండి వచ్చే తీర్థం తీసుకుంటే చర్మ వ్యాధులు తగ్గిపోతాయట. వేలాది మంది శివ భక్తులు ప్రతి రోజు ఈ ఆలయాన్ని దర్శించుకుని, శివలింగానికి అభిషేకం చేస్తారు. కార్తీక మాంసం, మహాశివరాత్రి సమయంలో బుద్వా మహాదేవ్ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారో చరిత్రకారులు అంచనా వేయలేకపోతున్నారు.