కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఓ కుటుంబం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. డిగ్రీ కాలేజ్ లో ప్రేవేట్ లెక్చరర్ గా పనిచేసే వేముల శ్రీకాంత్ కుటుంబం మొత్తం నెల రోజుల వ్యవధిలో చనిపోయారు. తర్వాత శ్రీకాంత్ కూడా విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట కుమారుడు, ఆ తర్వాత కుమార్తె, తర్వాత భార్య చనిపోయింది. గ్రామంలో ఎవరికీ ఈ మిస్టరీ అంతు చిక్కలేదు. వాంతులు, విరేచనాలతో చనిపోతుంటే ఏదో వింత వ్యాధి అనుకున్నారు. అయితే పోలీసులకు ఓ వైపు శ్రీకాంత్ పై అనుమానాలు మొదలయ్యాయి.
అయితే పోలీసుల విచారణలో శ్రీకాంత్ కుటుంబం మృతి కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. వారిది సహజ మరణం కాదని.. శ్రీకాంత్ అందరినీ హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు తన కోసం వస్తారనే విషయం తెలుసుకునే శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే శ్రీకాంత్ ఎందుకు హత్య చేశాడో తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు. శ్రీకాంత్ మొదట్లో చాలా బాగా ఉండేవాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాలేజ్ లో కూడా శ్రీకాంత్ కు మంచి లెక్చరర్ అనే పేరుంది.
అయితే ఓరోజు కుమారుడు అద్వేత్ కు ఆరోగ్యం బాలేదని ఫొటోలు షేర్ చేస్తూ అందరినీ సాయం చేయమని కోరాడు. తర్వాత చికిత్స పొందుతూ కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత పదిహేను రోజుల వ్యవధిలోనే కుమార్తె కూడా మంచం పట్టింది. ఆమె కూడా చనిపోయింది. కుమార్తె మరణించిన తర్వాత భార్య కూడా ఆస్పత్రిలో చేరింది. ఇద్దరిలాగానే భార్య కూడా చనిపోయింది. అయితే శ్రీకాంత్ మీద అనుమానంతో ముగ్గురు రక్త నమూనాలను పోలీసులు బాంబే పంపించారు. వారి శరీరంలో విషం ఉన్నట్లు బ్లడ్ రిపోర్ట్స్ లో వచ్చింది.
పోలీసులు పక్కా ఆధారాలతో శ్రీకాంత్ ని అరెస్టు చేసేందుకు సిద్ధ పడుతున్న సమయంలోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ప్రాథమికంగా విష ప్రయోంగ వల్లే కుటుంబం చనిపోయినట్లు తెలిపారు. పూర్తి నివేదిక వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇతను ఈ హత్యలు చేయడానికి కారణం అక్రమ సంబంధంగా తెలుస్తోంది. మరో మహిళతో అక్రమ సబంధం పెట్టుకోవడం కారణంగానే శ్రీకాంత్ భార్యాపిల్లలను తప్పించేందుకు ఇలా చేశాడని తెలుస్తోంది. శ్రీకాంత్ నిజ స్వరూపం తెలుసుకుని స్థానికులు నివ్వెరపోయారు.
రోజూ తాము చూసే శ్రీకాంత్ ఇంత దుర్మార్గుడా అని తెలుసుకుని నోరెళ్లబెడుతున్నారు. పరాయి మహిళతో పక్క పంచుకునేందుకు కుటుంబాన్ని హతమార్చాడని తెలుసుకుని ఛీ కొడుతున్నారు. ఆత్మహత్య చేసుకుని మంచి పని చేశాడని.. లేదంటే స్థానికులే బుద్ధి చెప్పేవారంటూ కామెంట్ చేస్తున్నారు. వేముల శ్రీకాంత్ మనిషి కాదు.. రాక్షసుడు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పి, బుద్ధులు నేర్పాల్సిన లెక్చరర్ ఇలా చేశాడని తెలుసుకుని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.