సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. వారిని నిత్యం సమాజంలో తిరిగే కొందరు గుంట నక్కలు వేధిస్తుంటారు. వారు చెప్పినట్లు చేస్తే సరి.. లేకుంటే, వేధింపులు, బెదిరింపులు, అవరసమైతే ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడటంలేదు. తాజాగా రెండేళ్ల క్రితం పెళ్లై, 5 నెలల బాబు ఉన్న మహిళను, ఓ కామాంధుడు తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. తన మాటవినని ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం లో చోటుచేసుకుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. కనిగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితను అదే ప్రాంతానికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి వేధిస్తున్నాడు. అంతటితో ఆగక సదరు మహిళ భర్తకే ఫోన్ చేసి ఆమెను పంపాలంటూ బెదిరించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆమె కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని మీద పోలీసుల వైపు నుంచి ఎటువంటి చర్యలు లేవంటూ.. ఇటీవల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమంలో మరోమారు ఫిర్యాదు చేసింది.
అనంతరం కనిగిరి బస్టాండ్ నుంచి తన తల్లితో కలిసి నడిచి వస్తున్న ఆమెను అడ్డుకున్నాడు. నాపైనే కేసు పెడతారా అంటూ… రక్తమొచ్చేలా వారిద్దరినీ కొట్టాడు. నీ భర్తను చంపేస్తానంటూ బెదిరించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా అతనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకోలేదని మహిళ ఆరోపిస్తోంది. అతనికి రాజకీయ నాయకుల అండ ఉండబట్టే పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని విమర్శిస్తోంది. నిందితుడిని వెంటనే అరెస్టు చేయకపోతే ధర్నా చేస్తామంటూ రజక సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ విషయంపై ఎస్ఐ రామిరెడ్డిని వివరణ కోరగా.. తమకు అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.