రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వలన ఏ పాపం ఎరుగుని అమాయకులు బలవుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్రగాయలతో అంగవైకల్యం ఏర్పడి.. జీవితాన్ని అతికష్టం గడుపుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాంతంలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటో, ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గురువారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం నుంచి కొందరు మహిళ కార్మికులతో ఆటో వస్తుంది. అలానే అబ్దుల్లాపూర్ మెట్ నుంచి చౌటుప్పల్ వైపు ప్రైవేటు బస్సు వెళ్తుంది. ఈ క్రమంలో దండు మాల్కాపురం పారిశ్రామిక పార్క్ సమీపంలోకి రాగానే ఆటో, ఆర్టీసీ బస్సు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో ఆటోలోని 8 మంది ప్రయాణికులకి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నలుగురు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు మహిళలు మృతి చెందారు.
మృతి చెందిన వారు డాకోజి నాగలక్ష్మి(28), వరకాంతం అనసూయ(55), సిలివేరు ధనలక్ష్మి(35), దేవరపల్లి శిరీష(30)గా గుర్తించారు. మరణించిన వారందరూ ఓ పచ్చళ్ల పరిశ్రమలో ఉపాధి పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. రోజూ మాదిరిగానే గురువారం కూడ పచ్చళ్ల పరిశ్రమకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మహిళా కార్మికుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. తమకు ఆధారంగా ఉన్నవారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి బంధువులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. రోజూ మాదిరి పనికి వెళ్లిన తమ వారు శవాలుగా తిరిగి రావడంతో వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.
బస్సులోని వారికి స్వల్ప గాయలైనట్లు స్థానికులు అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీఐ మల్లికార్జున్ రెడ్డి, ఎస్సై సీతాపాండు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన ఎలా జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈప్రాంతంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటాయని స్థానికులు వాపోతున్నారు. మరి.. ఇలా తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.