నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతుంటారు. మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి.. మోసం చేస్తున్నారు. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువకులను టార్గెట్ గా చేసి మరికొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతుంటారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారి నుంచి లక్షల్లో డబ్బులను కాజేస్తుంటారు. తాజాగా కొందరు కేటుగాళ్లు అలాంటి మోసానికి పాల్పడ్డారు. రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి రూ.43 లక్షలు తీసుకొని మోసగించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
గుంటూరులోని భవానీపురానికి చెందిన రవీంద్ర అనే యువకుడు ఇంటర్ చదువుకున్నాడు. అతని సోదరుడు రాజు కూడా బీఈడీ చదివాడు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే పలు సార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు రాశారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి గుంటూరు రైల్వే శాఖలో పనిచేసే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇదే సమయంలో రవీంద్ర, రాజు తమ వ్యక్తిగత విషయాలను అతడితో షేర్ చేసుకున్నారు. దీంతో ఆ వ్యక్తితో పాటు మరో ఇద్దరు కలిసి రైల్వేశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించారు. అందులో భాగంగా ఒక్కొక్కరు రూ.15 లక్షలు ఇస్తే వారణాసి రైల్వేజోన్ లో టీసీ ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలిపారు.
వారి మాటలను నమ్మిన రవీంద్ర, రాజులు ముందుగా చెరో రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలు కట్టారు. వీరిద్దరిని నమ్మించేందుకు.. వైద్య పరీక్షలని ఢిల్లీకి తీసుకు వెళ్లి.. అక్కడ రైల్వే ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. ఇదే సమయంలో వీరికి మహేష్ అనే యువకుడు పరిచయమయ్యాడు. తానూ ఉద్యోగం వేటలో ఉన్నానని అతడు తెలిపాడు. దీంతో మహేష్ కూడా రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని వారు నమ్మించి..రవీంద్ర ఖాతలోకి రూ.13 లక్షలు జమ చేయించారు. ఈ ముగ్గురిని ఇంటర్వ్యూ పేరుతో హైదరాబాద్, వారణాసి తీసుకువెళ్లారు. ఉద్యోగానికి ఎంపికైనట్లు నకిలీ గుర్తింపు కార్డు, కొన్ని పత్రాలు ఇచ్చి..మిగిలిన రూ.5 లక్షలను వారి నుంచి తీసుకున్నారు. ఇక త్వరలో పోస్టింగ్ వస్తుందని నమ్మించారు. ఆ తరువాత కరోనా, లాక్ డౌన్ సాకు చూపుతూ కాలం రోజులు గడిపారు. అయితే నెలలు గడుస్తున్న ఉద్యోగంలో చేర్పించకపోవడంతో బాధితులు అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో వారి వద్దకు వెళ్లి తమ ఉద్యోగాల గురించి అడగ్గా.. విజిలెన్స్ పోలీసులు రైల్వే అధికారులను పట్టుకున్నారని, దీంతో ఆ ఉద్యోగాలను నిలిపివేశారని తెలిపారు. అయితే పోలీశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మరోసారి రవీంద్ర రాజులకు తెలిపారు. ఈక్రమంలోనే విజయవాడకు తీసుకెళ్లి.. అక్కడ ఇంటర్వ్యూల పేరుతో నమ్మిచారు. ఈ ఉద్యోగం విషయంలో కూడా నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ఎటువంటి ఉద్యోగం రాలేదు. దీంతో విసుకు చెందిన రవీంద్ర, రాజులు.. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమన్నారు. ఈ సమయంలో రౌడీలతో కొట్టి చంపిస్తామని ఆ ముఠా సభ్యులు బెదిస్తున్నట్లు బాధితులు వాపోయారు. తమవి రూ.30 లక్షలతో పాటు మహేష్ చెందిన రూ.13 లక్షలు రవీంద్ర ఖాతలో జమ చేయించి.. మొత్తం రూ.43 లక్షలు స్వాహా చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తమను మోసగించిన ముఠా సభ్యులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు.