కొత్త సంవత్సరం రోజున ఆ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లీడుకొచ్చిన కూతురు అర్థాంతరంగా తనువు చాలించింది. స్నానం చేయటానికి బాత్రూమ్లోకి వెళ్లి, తిరిగిరాని లోకాలకు చేరుకుంది. తమ కూతురు మరణానికి కారణాలు తెలీక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన రాజస్తాన్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్, కోటకు చెందిన స్వాతి బీఏ మూడవ సంవత్సరం చదువుతోంది. డిసెంబర్ 31న ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి పార్టీ చేసుకోవటానికి బయటకు వెళ్లింది. మరుసటి రోజు ఉదయం ఇంటికి తిరిగి వచ్చింది.
బాగా నిద్రపోయి 12 గంటల ప్రాంతంలో నిద్రలేచింది. నిద్ర లేచిన తర్వాత స్నానం చేయటానికి బాత్రూమ్లోకి వెళ్లింది. గంటలు గడుస్తున్నా స్వాతి బాత్రూమ్లోంచి బయటకు రాలేదు. దీంతో ఆమె తల్లి డోర్ తట్టి కూతుర్ని పిలిచింది. అయినప్పటికి లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎంత పిలిచినా.. లోపలినుంచి ఎలాంటి ఉలుకు,పలుకు లేకపోయేసరికి తల్లిదండ్రుల మనసు కీడు శంకించింది. వెంటనే బాత్రూమ్ తలుపులు బద్ధలు కొట్టారు. స్వాతి స్ప్రహలేని స్థితిలో నేలపైడి పడి ఉంది. ఆమెను హుటాహుటిన దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
స్వాతిని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఎలాంటి అనారోగ్యం లేని తమ కూతురు ఇలా ఉన్నట్టుండి చనిపోవటంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురికి ఎలాంటి అనారోగ్యం లేదని, రోగాలు కూడా ఏవీ లేవని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో స్వాతి మరణానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. మరి, బాత్రూములో అనుమానాస్పదంగా మృతి చెందిన స్వాతి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.