అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు, వేరే యువకుడితో ప్రేమలో ఉందన్న విషయాన్ని ఆ తండ్రి తట్టుకోలేక పోయాడు. పరువు – ప్రతిష్టల పేరుతో కూతురు ప్రేమిస్తున్న యువకుడిని హత్య చేయించేందుకు కుట్రపన్నాడు. అందుకు సుపారీ ఇచ్చి ముఠాను కూడా సిద్ధం చేశాడు. వారు కాస్తా పోలీసులకు దొరికిపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ కు చెందిన నీలం శ్రీనివాస్ (45) కూతురు శిరీష (23), టౌన్ పరిధిలోని సుభాష్ నగర్ కు చెందిన చింతలతండం మనోజ్ కుమార్(25) మధ్య గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న శిరీష తండ్రి, ఆమెకు ఏడాది కిందట మరొకరితో వివాహం జరిపించారు. వివాహం అయ్యాక కూడా శిరీష అతనితో ప్రేమవ్యవహారం కొనసాగిస్తోంది. కొన్ని నెలల క్రితం మనోజ్ కుమార్ తో కలిసి ఇంటి నుంచి ముంబయి పారిపోయింది.. అక్కడ వారం రోజులు గడిపాక మళ్లీ వేములవాడకు చేరుకున్నారు. అయితే భర్త ఆమెను అంగీకరించకపోవడంతో అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది.
ఇది కూడా చదవండి: Bihar: అందంగా ఉందని అత్తపై కన్నేసిన అల్లుడు.. కూతురు లేని టైమ్ చూసి!
ఈక్రమంలో పలు సార్లు పంచాయితీలు కూడా జరిగాయి. ఎంత చెప్పినప్పటికీ శిరీష, మనోజ్ కుమార్ ను విడిచిపెట్టలేదు. దీంతో ఆమె తండ్రి నీలం శ్రీనివాస్, తన స్నేహితుడైన మానుక కుంబయ్యలు కలిసి యువకుడిని చంపేందుకు నిర్ణయించుకున్నారు. అందుకోసం బీహార్ కు చెందిన లఖింద్ర సాహ్ని, కోరుట్ల పట్టణానికి చెందిన బొమ్మిడి రాజుకుమార్ తో కలిసి రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మనోజకుమార్ కదలికలను గమనిస్తూ హత్య చేసేందుకు తిప్పాపూర్ బస్టాండ్ పరిసరాలల్లో తచ్చాడుతుండగా..పెట్రోలింగ్ పోలీసులను చూసిన నిందితులు కారు స్టార్ట్ చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. అనుమానమొచ్చిన పోలీసులు వెంబడించి పట్టుకొని కారును తనిఖీ చేయగా అందులో రెండు పెద్ద కత్తులు లభించాయి. దీంతో నలుగురిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నలుగురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.