భార్యా భర్త అన్న బంధానికి, పదానికి కొంతమంది కొత్త అర్థం చెబుతున్నారు. క్షణికావేశాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు తీసే వరకు వెళుతున్నారు. ఇందులో ఆడ, మగ అన్న తేడా లేదూ.. ఇద్దరూ పోటా పోటీగా నేరాలకు పాల్పడుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ భార్య జనవరి ఫస్ట్ రోజున భర్తకు జీవితంలో మరిచిపోలేని చేదు జ్ఞాపకాన్ని మిగిల్సింది. కొత్త సంవత్సరం రోజున ఆసుపత్రిలో భర్తతో గొడవ పెట్టుకుంది. దారుణంగా అతడి గొంతుకోసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోస్పాడు మండలం, కానాలపల్లెకు చెందిన లక్ష్మీదేవీ, బ్రహ్మయ్య భార్యాభర్తలు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య మీద అనుమానంతో బ్రహ్మయ్య తరచుగా ఆమెను కొట్టేవాడు. ఈ నేపథ్యంలోనే వారం క్రితం కూడా భార్య మీద దాడి చేశాడు. ఈ దాడిలో లక్ష్మీదేవి గాయపడింది. గాయపడ్డ ఆమెను కుటుంబసభ్యులు నంద్యాల పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. గత కొద్ది రోజుల నుంచి ఆమె అక్కడే చికిత్స పొందుతోంది. ఆదివారం బ్రహ్మయ్య భార్యను చూడటానికి ఆసుపత్రికి వెళ్లాడు. భర్త రావటం గమనించిన లక్ష్మీదేవీ పొరపాటు పడింది. తన మీద మళ్లీ దాడి చేయటానికి వస్తున్నాడని భావించింది. దగ్గరకు వచ్చిన భర్తపై కత్తితో దాడి చేసింది.
అతడి గొంతు కోసింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకున్నాడు. డాక్టర్లు గాయపడ్డ బ్రహ్మయ్యకు వెంటనే చికిత్స అందించటం మొదలుపెట్టారు. అయితే, అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక, ఈ సంఘటనపై మరో కథ ప్రచారంలో ఉంది. ఆసుపత్రికి వచ్చిన భర్త నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పకపోవటంతో కోపగించిన లక్ష్మీదేవీ దాడి చేసిందని, బ్రహ్మయ్య గొంతు కోసిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.