అదో ప్రముఖ లాడ్జి. నిత్యం ఎంతో మంది అక్కడికి వస్తూ పోతూ ఉంటారు. అలాంటి లాడ్జిలో ఓ దారుణం వెలుగు చూసింది. లాడ్జిలోని ఓ గదిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. అతడి ఒంటిపై బట్టలు లేకపోవటం.. అతడు చనిపోయిన గదినుంచి ఓ మహిళ బయటకు వెళ్లిపోవటంతో పోలీసులకు హత్య జరిగిందేమోనన్న అనుమానం వస్తోంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల మేరకు.. కర్ణాటకలోని మంగళూరు, పంప్వెల్ ఏరియాలో పద్మశ్రీ అనే ప్రముఖ లాడ్జి ఉంది. నిత్యం పదుల సంఖ్యలో జనం అందులో బస చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రోజు ఉప్పళ ప్రాంతానికి చెందిన అబ్దుల్ కరీమ్ అనే వ్యక్తి లాడ్జిలో బస చేశాడు. 13వ తేదీ ఉదయం లాడ్జి సిబ్బంది అతడి రూము దగ్గరకు వెళ్లి డోర్ కొట్టారు. అతడు డోర్ తీయలేదు. దానికి తోడు డోర్ తెరిచి ఉండటంతో వారికి అనుమానం వచ్చింది.
లోపలికి వెళ్లి చూడగా గదిలో అబ్దుల్ నగ్నంగా పడి ఉన్నాడు. అతడ్ని పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అబ్దుల్ మరణించిన గదిలో క్షీరబాల అనే ఆయుర్వేదిక్ టాబ్లెట్లు లభించాయి. లాడ్జీలోని సీసీటీవీలను పరీక్షించగా.. అబ్దుల్ మరణించిన గది నుంచి ఓ మహిళ బయటకు రావటం గుర్తించారు. సదరు మహిళకు ఈ మృతికి ఏదైనా సంబంధం ఉండొచ్చేమోనని అనుమానిస్తున్నారు. హత్య కోణంలో విచారణ చేస్తున్నారు.