ప్రపంచమంతా సాంకేతికత వైపు పరుగులు పెడుతుంటే కొందరు మాత్రం ఇంకా లింగ భేదాల దగ్గరే ఆగిపోతున్నారు. అమ్మాయి పుడితే ఏదో అరిష్టం అన్నట్టు చూసే జనం ఇంకా మన చుట్టూ ఉండడం నిజంగా దురదృష్టం. వారసుడి కోసం కొందరు పుట్టబోయే ఆడ బిడ్డల్ని పురిట్లోనే చంపేస్తున్నారు. కొందరు అబ్బాయి పుట్టే వరకూ భార్యని పిల్లల్ని కనే యంత్రంగా మారుస్తున్నారు. ఇంకొందరైతే మగ సంతానం కోసం ఏకంగా నర బలులు ఇస్తున్నారు.
మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో కియోటి గ్రామంలో చోటు చేసుకున్న నర బలి తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామ్ లాల్ అనే వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. అయితే అతనికి మగ సంతానం అంటే ఇష్టం. దీంతో భార్యను మగ బిడ్డను కనలేదని నిత్యం వేధిస్తుండేవాడు. ఆమె మరోసారి గర్భం దాల్చడంతో ఈసారైనా మగ బిడ్డ జన్మించాలని తాంత్రికుడ్ని కలిసి ప్రత్యేక పూజలు చేశాడు.
స్థానిక ఆలయంలో యువకుడ్ని బలి ఇస్తే.. కొడుకు పుడతాడని తాంత్రికుడు చెప్పడంతో రామ్ లాల్ అతని మాటలు నమ్మాడు. రామ్ లాల్ ఆలయానికి వెళ్లి తనకు మగ సంతానం కలగాలని ప్రార్ధించాడు. కట్ చేస్తే గత వారం రామ్ లాల్ భార్య డెలివరీ అయ్యింది. కోరుకున్నట్లే మగ బిడ్డ జన్మించాడు. తన కోరిక నెరవేరిందని నర బలి ఇవ్వాలని సిద్ధమయ్యాడు. గ్రామంలోని ఆలయం వద్దకు వెళ్లి.. అక్కడే మేకలను మేపుతున్న దివ్యాంష్ అనే బాలుడిని ఆలయంలోకి కత్తితో పొడిచి చంపేశాడు.
ఈ ఘటన జూలై 6 న జరిగింది. అప్పటి నుండి బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని.. బాలుడి శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: పిల్లలు కలగలేదని కోడలి ముఖంపై వేడి నూనె పోసిన అత్తమామలు!