సమాజంలో మహిళల మీద మరీ ముఖ్యంగా భార్యల మీద జరిగే దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎన్ని కఠిన చట్టాలు చేసినా కసాయి వాళ్ల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా ఓ దారుణం వెలుగు చూసింది. ఆ వివరాలు..
మంచి భార్య, మంచి మహిళ అంటే ఎలా ఉండాలో చెప్పిన పురాణాలు.. ఓ మగాడు మంచి వ్యక్తిగా, భర్తగా ఎలా ఉండాలో మాత్రం చెప్పలేదు అని సినిమా డైలాగ్ ఉంది. చాలా సందర్భాల్లో అది నిజమేనేమో అనిపించకమానదు. ఇక భరించేవాడు భర్త అన్నారు కానీ.. ఎక్కువ సందర్భాల్లో ఇది రివర్స్ అవుతుంది. భర్తలో ఎన్ని అవలక్షణాలున్నా సరే.. భార్య ఓర్పుగా భరిస్తుంది.. మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. కన్న బిడ్డల కోసం, తల్లిదండ్రుల కోసం, సమాజం కోసం అత్తింటి వారి వేధింపులను, భర్త తనపై చేసే అఘాయిత్యాలను భరిస్తుంది. పాతికేళ్లు కనిపెంచిన తల్లిదండ్రులను, అయినవారిని వదులుకుని.. భర్తే సర్వస్వం అని భావించి.. మెట్టినింట అడుగుపెడుతుంది. ఇక భర్త తనను నెత్తిన పెట్టుకోకపోయినా పర్లేదు.. మనిషిగా గుర్తిస్తే చాలు అనుకుంటుంది. కానీ చాలా సందర్భాల్లో నిరాశే ఎదురవుతుంది. అత్తారింట్లో వేధింపులు, భర్త చేతిలో నరకం చూడటమే కాక.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలే పొగొట్టుకుంటుంది. అలాంటి దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది.
కట్టుకున్న భర్త కాలయముడై.. భార్య బతికుండగానే ఆమెపై శానిటైజర్ పోసి ఆమెను సజీవ దహనం చేసే ప్రయత్నం చేశాడు. ఒళ్లంతా పూర్తిగా కాలిపోయి.. నరకం అనుభవిస్తూ కూడా పిల్లల గురించి ఆలోచించి.. భర్త చేసిన దారుణంపై నోరు విప్పలేదు. కానీ తండ్రి ఎంతటి కసాయివాడో ప్రత్యక్షంగా చూసిన పిల్లలు మాత్రం పోలీసులకు అసలు విషయం చెప్పారు. ఆ ఇళ్లాలు చేసిన త్యాగం చూసి పోలీసులు సైతం కదిలిపోయారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ శివార్లోని మేడ్చల్లో చోటు చేసుకుంది. నవ్యశ్రీ (33) అనే మహిళకు సిద్దిపేట జిల్లా ములుగుకు చెందిన తిరునగర్ నరేందర్ (35)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరు మేడ్చల్ పరిధిలోని సూర్య నగర్లో నివాసం ఉంటున్నారు. నవ్యశ్రీ దంపతులకు ఇద్దరు పిల్లలు శ్రీ చందన (14), శ్రీ మేఘన (12) ఉన్నారు.
ఇక గత నెల అనగా ఫిబ్రవరి 18న శివరాత్రి రోజున.. భార్యాభర్తలిద్దరి మధ్య ఏదో విషయమై గొడవ అయ్యింది. ఈ కోపంలో భర్త నరేందర్.. నవ్యశ్రీ మీద శానిటైజర్ పోసి నిప్పటించాడు. ఆమె మంటల బాధకు తాళలేక కేకలు వేయడంతో.. పక్కంటి వారు వచ్చి మంటలు ఆర్పి.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలియడంతో పోలీసులు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశారు. అయితే తాను నిజం చెబితే.. భర్త జైలుకు వెళ్తాడు.. ఇద్దరు ఆడబిడ్డలు అనాథలవుతారు అని భావించిన నవ్యశ్రీ.. భర్త చేసిన దారుణం గురించి పోలీసులకు చెప్పలేదు.
శివరాత్రి రోజున తాను ఉపవాసం ఉన్నానని, అది ముగించుకొని 4 గంటలకు దేవుడికి దీపం వెలిగించేందుకు అగ్గిపుల్లను వెలిగించి.. దాన్ని కింత పడేయగా.. అది ప్రమాదవశాత్తూ తన కాళ్ల వద్ద చీరకు అంటుకొని మంటలు వ్యాపించడంతో గాయపడ్డానని నవ్యశ్రీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. నొప్పి తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చి ఆర్తనాదాలు చేయడంతో పొరుగున ఉండే లలిత కుమారి, భర్త నరేందర్ పరుగెత్తుకొచ్చారని వెల్లడించింది.
లలిత కుమారి నీళ్లతో మంటలను ఆర్పివేసిందని.. ఈ లోపు విషయం తెలియడంతో తన భర్త వచ్చి చికిత్స కోసం తనను ఆస్పత్రికి తరలించాడని నవ్యశ్రీ పోలీసులకు తెలిపింది. అంతేకాక తనకు మెరుగైన వైద్యం అందించడం కోసం.. భర్త తనను సుచిత్ర సమీపంలోని రష్ ఆస్పత్రిలో చేర్పించారని వెల్లడించింది. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మేడ్చల్ పోలీసులు ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా కేసు నమోదు చేశారు. ఇక మార్చి 5న మధ్యాహ్నం కాలిన గాయాలకు చికిత్స పొందుతూ నవ్యశ్రీ.. గాంధీ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది.
అయితే తండ్రి చేసిన దారుణాన్ని కుమార్తెలు జీర్ణించుకోలేకపోయారు. కళ్ల ముందే తల్లిని అంత దారుణంగా హత్య చేయడం చూసి ఆ పిల్లలు వణికిపోయారు. జరిగిన దారుణం గురించి పోలీసులకు తెలపాలని భావించారు. ఈ క్రమంలో నవ్యశ్రీ పెద్ద కూతురు శ్రీ చందన తల్లి మృతి చెందిన మరుసటి రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి, తన తండ్రి నరేందరే తల్లికి నిప్పంటించాడని ఫిర్యాదు చేసింది. కావాలనే తల్లిపై ‘శానిటైజర్’ పోసి చంపేశాడని పోలీసులకు తెలిపింది.
ఆ సమయంలో తాను తండ్రిని ఆపేందుకు ప్రయత్నించానని.. అయితే, అతడు ఆగకుండా తన తల్లిపై శానిటైజర్ పోసి నిప్పంటించాడని బాలిక వెల్లడించింది. ఇక నరేందర్.. తన భార్యపై విచక్షణారహితంగా దాడి చేసి, శానిటైజర్ పోసి నిప్పంటించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తండ్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి బిడ్డల గురించి ఆలోచించి నవ్యశ్రీ పోలీసులకు నిజం చేప్పకపోవడం సరైందే అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.