మనిషిని నడిపించేది డబ్బు. ప్రపంచాన్ని తలకిందులు చేయగల శక్తి.. కరెన్సీ నోటు సొంతం. డబ్బులంటే మక్కువ లేని వారు అసలు లోకంలో ఉండరేమో. మనిషి జీవితాంతం డబ్బు కూడబెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. ఎంత ఉన్నా సరిపోదు. మనిషిలోని ఈ అత్యాశే.. మోసగాళ్లకు ఆయువు పట్టవుతుంది. తక్కువతో ఎక్కువ లాభం అని నమ్మబలికి.. ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఫ్రీగా.. ఉత్తి పుణ్యానికి ఎవరు ఎక్కువ వడ్డి ఇవ్వరు అని ఎంత చెప్పినా కొందరికి అర్థం కాదు. నిత్యం తమ చుట్టూ వందల మంది.. ఇలాంటి ఉచ్చులో చిక్కి.. మోసపోతున్నా సరే జాగ్రత్త పడరు. అత్యాశకు పోయి.. మోసగాళ్ల వలలో పడుతూనే ఉంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ కిలేడీ మాయమాటలు నమ్మి.. ఏకంగా 200 మంది దారుణంగా మోసపోయారు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఆ వివరాలు..
ఈ సంఘటన వికారాబాద్ జిల్లా.. కడ్మూరు గ్రామంలో చోటు చేసుకుంది. కొన్ని నెలల క్రితం ఈ గ్రామానికి సీమ అనే మహిళ వచ్చింది. తాము ఒక యాప్ ని అభివృద్ధి చేశామని.. దీనిలో డబ్బులు పెట్టుబడి పెడితే.. రెట్టింపు లాభం వస్తుందని నమ్మ బలికింది. ఆమె మాటలు నమ్మి.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మంది యాప్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. వారిని నమ్మించడం కోసం మొదట్లో భారీగా లాభాలు కళ్ల చూపింది.
500 రూపాయల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెట్టవచ్చని… ఎంత ఎక్కువ పెడితే అంతకు రెట్టింపు లాభం అని చెప్పడంతో.. జనాలు అప్పులు చేసి మరి యాప్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. కొన్ని రోజుల వరకు బాగానే సాగింది. ఆ తర్వాత నెమ్మదిగా లాభాలు ఇవ్వకుండా తప్పించుకుని తిరగసాగింది సీమ. చివరకు ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. మోసపోయామని గ్రహించిన గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన మోసాన్ని తెలిపి.. ఎలాగైనా తమ డబ్బులను తిరిగి ఇప్పించాల్సిందిగా పోలీసులను వేడుకున్నారు గ్రామస్తులు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కిలేడీ సీమ కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.