ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ లో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు జరిగాయి. తాజాగా ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
ప్రతి మనిషి కష్టపడి డబ్బు సంపాదించి.. జీవితంలో ఉన్నత స్థితికిలో వెళ్లాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే రేయింబవళ్ల కష్టపడి ధనాన్ని కూడబెడుతుంటారు. పేద, మధ్య తరగతులకు చెందిన వారు నిత్యం కష్టపడుతూ వివిధ అవసరాల కోసం కొంత డబ్బులను దాచుకుంటారు. అనుకోని ప్రమాదాల కారణంగా వారు దాచుకున్న డబ్బు మొత్తం వృథాగా పోతుంది. తాజాగా అగ్నిప్రమాదం ఓ కుటుంబాన్ని నడ్డి రోడ్డున పడేసింది. వారు చేసిన కష్టమంతా క్షణాల్లో బుగ్గి పాలైంది. ఇంట్లోని సామాగ్రితో సహా అంతా కాలి బూడిదయ్యాయింది. వారు దాచుకున్న రూ.5 లక్షల నగదు బూడిదగా మారిపోయింది. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లెకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి కుక్కర్లు, మిక్సీలు తదితర వస్తువులను కంతులకు ఇచ్చే వ్యాపారం చేస్తుంటారు. అదే ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. సుధాకర్ కుమారుడికి ఆరోగ్య సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. అతడి ఆరోగ్యం బాగుండాలని దేవుళ్లకు పూజలు చేస్తుంటారు. ఈక్రమంలో మంగళవారం ఇంటికి తాళం వేసిన సుధాకర్, కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు తీర్చుకునేందుకు గ్రామంలోని ఓ ఆలయానికి వెళ్లారు.
ఇంతలోనే సుధాకర్ ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. సుధాకర్ నివాసం ఉండే ఇళ్లు బోద చేసిన కొట్టం కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఇంట్లోని సామాగ్రి అంతా కాలిపోయింది. మంటల ధాటికి బీరువాలోని బంగారు ఆభరణాలు సైతం కరిగిపోయాయి. కుమారుడి వైద్యంతో పాటు ఇతర అవసరాలకు దాచుకున్న సుమారు రూ.5 లక్షల నగదు మంటల్లో కాలి బూడిదైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది.
తాము చేసిన కష్టమంతా క్షణాల్లో మంటల్లో కలిసిపోయిందని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కాలిపోయిన నోట్లను చూసి ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నిత్యం అగ్నిప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. అనుకోకుండా జరిగే ఈ ప్రమాదాల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ఇదే ప్రమాదం రాత్రి సమయంలో జరిగి ఉంటే ప్రాణ నష్టం సంభవించేదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.