ఆంక్షలు దాటుకుని బయటకు వస్తున్నారనుకుంటున్న సమయాల్లో విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో వేధింపులను ఎదుర్కొంటున్నారు. కొంచెం నవ్వినా, కొంచెం స్నేహంగా మెలిగిన అవకాశ వాదంగా మార్చుకుంటున్నారు మగవాళ్లు. ఆమె అవసరాన్ని అలుసుగా తీసుకుని.. ఆమెను సాయపడుతున్నామన్న ముసుగులో.. శారీరక సుఖం తీర్చాలని వేధిస్తున్నారు
ఆడపిల్లలుగా పుట్టిన దగ్గర నుండి అడుగడునా ఆంక్షలు ఉండనే ఉంటాయి. గట్టిగా నవ్వకూడదు. బయటకు వెళ్లి ఆడుకోకూడదు, పర పురుషుడ్ని చూడకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అవి దాటుకుని బయటకు వస్తున్నారనుకుంటున్న సమయాల్లో విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో వేధింపులను ఎదుర్కొంటున్నారు. కొంచెం నవ్వినా, కొంచెం స్నేహంగా మెలిగిన అవకాశ వాదంగా మార్చుకుంటున్నారు మగవాళ్లు. ఆమె అవసరాన్ని అలుసుగా తీసుకుని.. ఆమెను సాయపడుతున్నామన్న ముసుగులో.. శారీరక సుఖం తీర్చాలని వేధిస్తున్నారు. అటు విద్యా సంస్థల్లో కీచక ఉపాధ్యాయులు… విద్యార్థినులను మార్కులు పేరు చెప్పి చెరపడుతుండగా.. బస్సుల్లో, ఉద్యోగాల్లో మరో రకమైన బాధను అనుభవిస్తున్నారు. ఇవి ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే.
ఇప్పుడు ఓ వైద్యుడు వేధింపులకు మరో మహిళ బలైంది. అవసరానికి అప్పు తీసుకుంటే.. తన కామ కోరికలు తీర్చాలని వైద్యుడు కోరడంతో ఆత్మహత్య చేసుకుందో నర్సు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. తల్లిదండ్రులు, అందిన సమాచారం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని ముదక్ పల్లి గ్రామానికి చెందిన గౌతమి (21).. నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో ఉన్న మనోరమ ఆస్పత్రిలో నర్పుగా పనిచేస్తున్నారు. అయితే ఇంటి అవసరాల నిమిత్తం ఆమె డాక్టర్ వద్ద రూ. 80 వేలు అప్పుగా తీసుకుంది గౌతమి. ప్రతి నెలా జీతంలో ఐదు వేల కట్ చేసుకునే ఒప్పందం మీద ఆ డబ్బు ఇచ్చాడు డాక్టర్. అలా కట్ చేసుకునే డబ్బులు ఇస్తున్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే తన అప్పు త్వరగా తీర్చాలని, లేదంటే తన కోరిక తీర్చాలంటూ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
అంతేకాకుండా మేనేజ్ మెంట్, ఇతర డాక్టర్లు కూడా తనను వేధిస్తున్నారని తెలిపారు. ఈ వేదనను తట్టుకోలేక గౌతమి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తల్లి లక్ష్మి అన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు హాస్పిటల్కు ఫోన్ చేసి డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడి సూసైడ్ చేసుకుంటున్నట్లు సమాచారం అందించింది. దీంతో ఆందోళనకు గురైన ఆ హాస్పిటల్ డాక్టర్.. నర్సు గౌతమి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి వారి కూతురు ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. తన కుమార్తెకు న్యాయం చేయాంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసనకు దిగారు. న్యాయం జరిగేంతవరకు తాము అక్కడ్నుంచి కదిలేది లేదంటూ బైఠాయించారు. సంబంధిత డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆత్మహత్య చేసుకున్న నర్సు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం డ్యూటీకి వెళ్లొద్దని తాము చెప్పినా, వినిపించుకోకుండా హాస్పిటల్కు వెళ్లిందని.. ఏం జరిగిందో కానీ ఇంటికి వచ్చిన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేసింది తల్లి.