తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యనందించి జీవితంలో ఉన్నతవంతులుగా ఎదగడానికి కృషి చేస్తుంటారు. పిల్లలు ప్రయోజకులై తమ కష్టాలను తీరుస్తారని భావిస్తుంటారు. పిల్లలపై కొండంత ఆశపెట్టుకుని జీవిస్తారు. అలా తమ కుమారుడిపై గంపెడు ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ ఎదురైంది. బాగా చదువుకుని ఉద్యోగం చేసి తమను సాకుతాడు అనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. జరిగిన ఘోరాన్ని తలుచుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు.
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. వారి పిల్లలు ఉన్నత స్థితికి చేరితే తమ కష్టాలు తీరిపోతాయని తల్లిదండ్రులు కోటి ఆశలతో జీవిస్తుంటారు. ఇదే విధంగా ఓ యువకుడి తల్లిదండ్రులు కష్టపడి కొడుకును చదివించారు. ఏ లోటు రాకుండా చూసుకున్నారు. ఆ తరువాత ఆ యువకుడు తల్లిదండ్రలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా లక్ష్యాన్ని ఏర్పర్చుకుని నిరంతర కృషి చేసి ఉద్యోగం సాదించాడు. కానీ అంతలోనే విధి ఎక్కిరించింది. ఉద్యోగం సాధించిన ఆనంద క్షణాలు తీరక ముందే ఘోరం జరిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని సురాయిపల్లి జగదాంబ తండాకు చెందిన ప్రశాంత్ బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
పలు కంపెనీలు ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం ఇంటర్య్వూలు నిర్వహించాయి. అయితే ఈ క్యాంపస్ ప్లేస్ మెంట్ లలో ప్రశాంత్ జాబ్ సాధించాడు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేసింది. ఉద్యోగం వచ్చిన శుభవార్తను కుటుంబ సభ్యులకు తెలియపరిచాడు. నిన్నరాత్రి(శుక్రవారం) అందరికీ మిఠాయిలు పంచాడు. తమ కుమారుడికి క్యాంపస్ ప్లేస్ మెంట్ లో ఉద్యోగం రావడంతో ఆనందంలో మునిగిపోయారు. ఆ తరువాత అందరు కలిసి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.
తెల్లారి ఉదయం పొద్దెక్కుతున్నప్పటకి ప్రశాంత్ నిద్ర నుంచి మేల్కోకపోవడంతో తల్లి వెళ్లి చూడగా అచేతన స్థితిలో మంచంపై పడుకుని ఉన్నాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రశాంత్ ను పరీక్షించిన ఆసుపత్రి వైద్యులు గుండెపోటు రావడంతో అతడు మృతిచెందినట్లు తెలిపారు. ఈ హఠాత్పరిణామంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. ఉద్యోగం వచ్చిందని చెప్పి అందరికి మిఠాయిలు తినిపించి సంతోషంగా గడిపిన కొడుకు గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు అతడిని తలుచుకుని గుండెలవిసేలా రోధించారు.