బంగారం అంటే భారతీయులకు ఎంత మోజో ప్రత్యేకంగా చెప్సాల్సిన పని లేదు. ఆభరణంగా మాత్రమే కాక.. పెట్టుబడిగా భావించి.. భారీగా బంగారం కొనుగోలు చేస్తారు. ఇక పండుగలు, వివాహాది శుభకార్యాల వేళ.. భారీగా బంగారం కొనుగోలు చేస్తారు. మనదగ్గర ధర ఎంత పెరిగినా.. పసిడికి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. అయితే నూతన సంవత్సరంలో బంగారం ధర పైపైకి వెళ్తుంది. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర.. 60 వేలకు పైగా పలుకుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే గత నెల రోజుల్లోనే బంగారం ధర.. ఏకంగా 3450 రూపాయలు పెరిగి.. పసిడి ప్రియులకు భారీ షాక్ ఇచ్చింది. ఇక కొంత కాలంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడం లేదు.
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర తాజాగా రూ.190 పెరిగి రూ.52,200 కు చేరింది. దీంతో గత 10 రోజుల్లోనే ఏకంగా రూ.1000 మేర పెరిగింది. ఇక గత నెల రోజుల నుంచి చూసుకుంటే ఏకంగా రూ.3,450 మేర పెరిగింది. డిసెంబర్ నెల ఒకటో తేదీన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.48,750 వద్ద ఉండేది. తాజాగా అది 52, 200 రూపాయలకు చేరుకుంది.
ఇక ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్లో ప్రస్తుతం రూ.210 పెరిగి తులానికి రూ.56,950 కి చేరింది. బంగారంతో పాటే వెండి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇక హైదరాబాద్లో ఒక్కరోజే సిల్వర్ ధర ఏకంగా రూ.1800 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం భాగ్యనగరంలో కిలో వెండి ధర రూ.75,800 కు చేరింది. ఇటీవలి కాలంలో ఇదే అత్యధికం కావడం విశేషం.
ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగి రూ.52,350 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.110 పెరిగి రూ.57,100 మార్కుకు చేరింది. అలానే ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.150 మేర పెరిగి.. రూ.72,900కు చేరింది.