అమరావతి ఏపీలోనే నంబర్ వన్ స్మార్ట్ సిటీగా ఏర్పడబోతోంది. ఈ క్రమంలో అక్కడ రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు కనుక పెట్టుబడి పెడితే రానున్న రోజుల్లో మంచి లాభాలను ఆర్జించవచ్చు.
భారతదేశంలోని స్మార్ట్ సిటీలు తమ పౌరులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడం, మెరుగైన సామాజిక సేవలను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలన్న భారత ప్రభుత్వ లక్ష్యం దాదాపు పూర్తయ్యింది. వీటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు బాధ్యత వహిస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికొచ్చేసరికి స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా నాలుగు సిటీలు ఎంపికయ్యాయి. ఈ నాలుగు స్మార్ట్ సిటీలు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో సానుకూల ప్రభావం చూపనున్నాయి. స్మార్ట్ హోమ్స్ కి డిమాండ్ పెరగడం, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కారణంగా ఈ సిటీల్లో రియల్ ఎస్టేట్ అనేది వేగంగా పెరుగుతుంది.
ఏపీలో స్మార్ట్ సిటీ మిషన్ లో ఎంపికైన వాటిలో అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతి.. స్థిరమైన, నివాసయోగ్యమైన స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతోంది. ఆవిష్కరణ, సాంకేతికత వంటి వాటిపై దృష్టి సారిస్తూ అమరావతి స్మార్ట్ సిటీని రూపొందిస్తున్నారు. ఈ అభివృద్ధి కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు అధిక డిమాండ్ ని క్రియేట్ చేస్తుందని, ఇది పెట్టుబడిదారులకు పెట్టుబడి అవకాశంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. లగ్జరీ రెసిడెన్షియల్ స్పేస్, ఆఫీస్ స్పేస్ లకి అమరావతిలో డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమరావతితో పాటు దాని చుట్టుపక్కల ఏరియాల్లో కూడా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని అంటున్నారు.
మంగళగిరి, బ్రాడీపేట్, నల్లపాడు, చుట్టుగుంట, శ్యామలా నగర్, విజయవాడ అమరావతి కారిడార్ లో కంకిపాడు, పెనమలూరు, పోరంకి, ఏడుపుగల్లు.. విజయవాడ ఎయిర్ పోర్ట్ కారిడార్ లో గన్నవరం, కేసరపల్లి వంటి ప్రాంతాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏరియాల్లో చదరపు అడుగు రూ. 1300, రూ. 1800, రూ. 2,000 రేంజ్ లో ఉన్నాయి. అమరావతిలో సగటున చదరపు అడుగు రూ. 1350, నంబూరులో రూ. 1650, చిలకలూరిపేటలో రూ. 900, మంగళగిరిలో రూ. 2000, నల్లపాడులో రూ. 1550, చుట్టుగుంట రూ. 2,150 రేంజ్ లో ఉన్నాయి. అంటే అమరావతిలో గజం కనిష్టంగా రూ. 8,100 నుంచి గరిష్టంగా రూ. 20 వేల వరకూ పలుకుతున్నాయి.
అమరావతి స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందితే అమరావతి, ఆ చుట్టుపక్కల ఏరియాల్లో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఉదాహరణకు అమరావతిలో చదరపు అడుగు రూ. 1350 అంటే గజం రూ. 12,150 చొప్పున 150 గజాల స్థలం కొనుగోలు చేస్తే రూ. 18,22,500 అవుతుంది. ఇప్పుడు పెట్టుబడి పెడితే.. మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అమరావతి స్మార్ట్ సిటీగా ఏర్పడితే ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగిపోతాయి. అమరావతితో పాటు నంబూరులో కూడా రియల్ ఎస్టేట్ బాగా జోరుగా సాగుతోంది. అమరావతికి 21 కి.మీ. దూరంలో ఉన్న నంబూరులో చదరపు అడుగు రూ. 1400 నుంచి రూ. 2,000 వద్ద కొనసాగుతోంది. గడిచిన మూడేళ్ళలో నంబూరులో ల్యాండ్ రేట్లు 200 శాతం పెరిగింది. గడిచిన ఏడాదిలో 83.3 శాతం పెరిగింది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఏడాది వ్యవధిలో లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందిగా మనవి.