పెట్టుబడిదారులకు సురక్షితమైన, భరోసాతో కూడిన రాబడిని అందించే పెట్టుబడి పథకాలకు తపాలా వ్యవస్థ నమ్మదగినది. పభుత్వ సంస్థ కనుక పొదుపు చేయాలనుకునే వారు సందేహాలు లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ మొత్తాలలో ఎక్కువ రాబడి అందించే ఎన్నో పథకాలను పోస్టాఫీస్ అందిస్తోంది. అలాంటి ఒక పథకం వివరాలను మీకందిస్తున్నాం..
భారత ప్రభుత్వం రంగానికి సంబంధించిన అతి కొద్ది సంస్థల్లో తపాలా వ్యవస్థ ఒకటి. ఒకప్పుడు ప్రజలకు ఉత్తర ప్రత్యుత్తరాలు అందించే ఈ సంస్థ, కాలక్రమేణా పొదుపు పథకాలు, బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకులకు ధీటుగా సేవలందిస్తూ ప్రజలకు మరింత చేరువ అవుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే పొదుపు పథకాలు పోస్టాఫీస్ లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అలాంటి అతి కొద్ది పథకాల్లో ‘గ్రామ సురక్ష పథకం’ ఒకటి. ఇందులో రోజుకు రూ. 50 చొప్పున.. అంటే నెల రూ.1500 పొదుపు చేస్తే.. మెచ్యూరీటి తరువాత రూ.31 నుంచి 35 లక్షల వరకు మీ చేతికందుతాయి. ఈ పథకంలో ఎలా చేరాలి..? ఎవరు అర్హులు..? ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
9 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సున్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద హామీ ఇవ్వబడిన కనీస మొత్తం రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. 55,58 లేదా 60 ఏళ్లు వచ్చేవరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షిక వాయిదాల్లో ప్రీమియం చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. అలాగే.. ఈ పథకంలో ఉన్న మరో ప్రయోజనం.. రుణ సదుపాయం. పథకం ప్రారంభించిన 4 సంవత్సరాల తరువాత లోన్ తీసుకోవచ్చు. అలాగే, పథకం నుండి తప్పుకోవాలనుకుంటే.. 3 సంవత్సరాలల తర్వాత సరెండర్ చేయవచ్చు.
ఉదాహరణకు ఒక వ్యక్తి 19 ఏళ్ల వయసులో 10 లక్షల బీమాతో కూడిన గ్రామా సురక్ష పాలసీని కొనుగోలు చేశాడనుకుందాం.. అతడు 55 సంవత్సరాల వరకు అయితే నెలవారీ ప్రీమియం రూ.1515, 58 సంవత్సరాలకు అయితే రూ.1463, 60 సంవత్సరాలకు అయితే రూ.1411 నెలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం మెచ్యూరిటీ ముగిశాక.. 55 సంవత్సరాల తరువాత రూ.31.60 లక్షలు రూ.58 ఏళ్ల తరువాత రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల తరువాత రూ.34.60 లక్షల వరకూ మెచ్యూరిటీ బెనిఫిట్ అందుతుంది.