ఆదాయపు పన్నుకు సంబంధించిన నూతన పన్ను విధానం 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వస్తోంది. అంటే ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పన్ను విధానం అమలులోకి రానుంది. మరి ఈ కొత్త పన్ను విధానం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది? ఎవరికి పన్ను కట్టాల్సిన పని లేదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త ఆదాయపు పన్ను విధానంలో జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లు వారి వార్షిక ఆదాయం రూ. 7.5 లక్షలు దాటనంత వరకూ ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించక్కర్లేదు. ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 7 లక్షలకు మించకుండా ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించే పని లేదని 2023 బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించింది. 2023 బడ్జెట్ లో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87ఏ కింద లభించే గరిష్ట రాయితీ పరిమితిని కేంద్ర ప్రభుత్వం 12,500 నుంచి 25 వేలకు పెంచింది. అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. సెక్షన్ 87ఏ కింద లభించే పన్ను రాయితీ కేవలం భారత్ లో నివాసం ఉండే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఎన్నారైలు, హిందూ అవిభక్త కుటుంబాలు, సంస్థలు ఈ పన్ను రాయితీకి అనర్హులు.
2023 కొత్త బడ్జెట్ లో ప్రభుత్వం జీతం అందుకునే ఉద్యోగులకు, పెన్షనర్లకు రూ. 50 వేలు స్టాండర్డ్ డిడక్షన్ ను పొడిగించింది. గతంలో స్టాండర్డ్ డిడక్షన్ పాత ఆదాయపు పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉండేది. 2023 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను తగ్గింపు, రాయితీ, ఆదాయపు పన్ను స్లాబ్ లలో మార్పుల ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు వార్షిక ఆదాయం ఏడున్నర లక్షల వరకూ ఉంటే ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 2023 బడ్జెట్ ప్రకారం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల నుంచి 3 లక్షలకు పెంచింది. అలాంటప్పుడు ఏడున్నర లక్షలకు పన్ను లేదని ఎలా చెబుతారని సందేహం రావడం సహజం.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 3 లక్షలు దాటితే పన్ను విధిస్తారు. అయితే ఏడున్నర లక్షల ఆదాయం ఉన్న వారు కొత్త పన్ను విధానంలో పన్ను రాయితీ, తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఎలా పని చేస్తుందంటే ఇప్పుడు మీ ఆదాయం రూ. 7.5 లక్షలు అనుకుంటే.. స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ. 50 వేలు తగ్గుతుంది. అప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 7 లక్షలు అవుతుంది. మామూలుగా ఆదాయం 3 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో ఉంటే 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే 3 లక్షలకు రూ. 15 వేలు అన్నమాట.
అదే 6 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో ఉంటే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే లక్షకు 10 శాతం అన్నమాట. అంటే 7 లక్షల ఆదాయానికి మీరు చెల్లించాల్సిన పన్ను రూ. 25 వేలు. కానీ సెక్షన్ 87 ఏ కింద రూ. 25 వేలు పన్ను రాయితీ లభిస్తుంది. అంటే ఏడున్నర లక్షల ఆదాయం వచ్చిన ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి అమలు అవుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.