కూరగాయల ధరలు, నిత్యవసరాల ధరలు కొండెక్కి సామాన్యలకు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ చార్జీల మోత మోగిస్తోంది. వీటన్నింటి మధ్యలో సామాన్యుడి జీవితం నలిగిపోతుంది. పెరుగుతున్న ధరలతో జేబుకు చిల్లుపడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరల గురించి అసలు చర్చించుకోకపోవడమే మేలు. ఇవన్ని చాలావన్నట్లు గ్యాస్ ధర సామాన్యుల పాలిట గుదిబండల మారింది. పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు చమురు కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. ఇప్పటికే కొద్ది నెలలుగా పెరుగుతూ వస్తున్న వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్ ధర తాజాగా రూ.50 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో బుధవారం నుంచి డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో ప్రస్తుతం రూ.1,003 ఉండగా, తాజా పెంపుతో రూ.1,053 అయింది.
మెట్రో సిటీల్లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ కొత్త ధర ఇలా ఉంది..
హైదరాబాద్ – రూ.1105
ఢిల్లీ – రూ.1,053
ముంబై – రూ. 1,052.50
కోల్కతా – రూ. 1,079
చెన్నై – రూ. 1068.50
ప్రస్తుతం దేశ ప్రజలకు ద్రవ్యోల్బణం నుంచి ఊరట లభిస్తుందనే ఆశ కనిపించడం లేదు. ఇప్పటికే హైదరాబాద్లో గ్యాస్ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. ప్రతి నెల 1న వంట గ్యాస్ ధరల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.183.50 మేర తగ్గించాయి. తాజాగా గృహావసరాల గ్యాస్ ధర మాత్రం పెంచాయి. గ్యాస్ సిలిండర్ల ధర పెంపుతో సామాన్యుడి జేబులపై మరింతగా ప్రభావం పడనుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.