ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. అంతేకాక భారతదేశంలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఇదే కాక వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరో కేంద్రమంత్రిగా కూడా నిర్మాల సీతారామన్ రికార్డు సృష్టించి.. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం వంటి దిగ్గజ నాయకుల సరసన నిలిచారు. ఇక 2019 నుంచి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పెడుతున్నారు.
అయితే బడ్జెట్ ప్రవేశ పెట్టే వేళ.. నిర్మాల సీతారామన్ ధరించిన చీరల రంగులపై ప్రత్యేక చర్చ జరుగుతుంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున ఆమె ఏ రంగు చీరలో ధరిస్తారు అనే దాని గురించి జనాలు ఆసక్తికరంగా చర్చించుకుంటారు. బడ్జెట్ వేళనే కాక ప్రత్యేక సందర్భాల్లో కూడా నిర్మలమ్మ ధరించే చీరల గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటారు జనాలు. నిర్మలమ్మకు కూడా చీరలంటే చాలా ఇష్టం. చేనేత చీరలంటే అభిమానం ఎక్కువ. ఇక ప్రీ బడ్జెట్ హల్వా వేడుక సందర్భంగా నిర్మలా సీతారామన్.. గ్రీన్, పసుపు రంగు కంజీవరం చీరలో కనిపించారు. ఇక నిర్మలా సీతారామన్ ప్రత్యేక సందర్భాల్లో ధరించే చీరలు.. ఎక్కువగా మన దేశ కరెన్సీ నోట్ల రంగులకు సరిపోతుంటాయి.
ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మాల సీతారామన్.. టెంపుల్ బార్డర్ ఉన్న ఎరుపు రంగు చీరలో కనిపించారు. గోల్డెన్ వర్క్, బ్లాక్ బార్డర్తో కూడిన ఎరుపు రంగు చీరను ధరించారు. ఎరుపు రంగు చీరను ధరించడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉందని చెబుతున్నారు. సాధారణంగా మనం ఎరుపు రంగును శక్తికి ప్రతీకగా భావిస్తాం. ప్రేమ, శక్తి, ధైర్యం, నిబద్ధతకు ప్రతిబింబంగా ఎరుపు రంగును సూచిస్తారు. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం శక్తికి ప్రతీక అయిన దుర్గామాతను కూడా ఎరుపు రంగుతో సూచిస్తాం.
అంటే ఈ ఏడాది బడ్జెట్ శక్తివంతమైన, సానుకూల బడ్జెట్ అని చెప్పడానికి గుర్తుగా నిర్మలా సీతారామన్ ఇలా ఎరుపు రంగు చీర ధరించారు అంటున్నారు. అంతేకాక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాల్లో నిర్మలమ్మ ఎక్కువగా ఎరుపు రంగు చీరల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. గతంలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాల్లో ఎరుపు రంగు చీరలనే ఎక్కువగా ధరించారు.