ఆ ఊరిలోని యువకులు ఓ మంచి పని చేయాలనుకున్నారు. వెంటనే చేయి చేయి కలిపి వారు అనుకున్నది సాధించేశారు. ఆ మంచిపనిని చూసి అందరు మెచ్చుకుంటున్నారు.
ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి.. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఓ ఊరికి మాత్రం సరైన రోడ్డు మార్గం లేక ఊరి జనం ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగి కాళ్లు అరిగిపోతున్నాయి కానీ వీరి గోడు పట్టించుకునే నాథుడు లేడు. అధికారుల చుట్టు తిరిగే ఓపిక నశించి ఆ ఊరి యువకులు అందరు కలిసి ఏకంగా బ్రిడ్జినే నిర్మించుకున్నారు. మరి ఈ అడవి బిడ్డల కష్టమేంటో.. ఊరిలోని యువకులు చేసిన మంచి పనేంటో పూర్తి వివరాల్లోకి వెళితే…
అనాకాపల్లి జిల్లా చోడవరం మండలం అన్నవరం వెంకయ్యగారి పేట అనే గ్రామం ఉంది. ఆ ఊరి చివరన రైవాడ నుండి వచ్చే వాగు ఉంది. ఈ వాగుకు అవతల వైపు ఉన్న భూముల్లో పాతిక గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. వానాకాలంలో ఈ వాగు ఉద్ధృతంగా పొంగి పొర్లుతుంది. ఆ గ్రామ ప్రజలు ఏరు దాటి సాగు చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత కొన్ని ఏళ్లుగా బ్రిడ్జిని నిర్మించాలని అధికారుల చుట్టు తిరుగగా ఎలాగోలా బ్రిడ్జి కట్టేందుకు పిల్లర్లు వేసి వదిలేశారు. కానీ వంతెన పూర్తి చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. దీంతో వారి సమస్యను తీర్చే నాథుడు లేక ప్రజలు నానా యాతన పడుతున్నారు.
రైతుల కష్టాలను చూసిన కొంతమంది యువకులు ఎవరో వస్తారని ఎదురు చూసేది ఎందుకని వారి సమస్యను వారే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఊరి యువకులంతా కలిసి వానర సైన్యంలా మారి వంతెన నిర్మించుకున్నారు. గ్రామంలోని యువకులంతా ఒక్కటై తమ సొంత నిధులతో, మహిళా కూలీల చేదోడు వాదోడుతో వంతెనను పూర్తి చేశారు. అందరు ఒకటై ఐకమత్యంతో ముందడుగేసి వారధికి తమ వంతు సహకారాన్ని అందించారు. గుండె ధైర్యంతో ముందుకు వెళ్లిన యువకులను అందరు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఎన్నికలొస్తే నాయకులు ఓట్ల కోసం వెంకయ్యగారి పేట గ్రామానికి ఎలా వెలతారో మరి! వారు ఓట్లు అడిగితే ఆ గ్రామ యువకులకు ఏం సమాధానం చెబుతారో చూడాలి.