నిత్యం ఎక్కడో ఒక్క చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రమాదల కారణంగా అమాయకులు బలవుతుంటారు. ఈ ప్రమాదాలకు మద్యం తాగి వాహనం నపడటం కూడా ఓ కారణం. మద్యం తాగి వాహనం నడపడం నేరమని పోలీసులు, ప్రభుత్వాలు గట్టి హెచ్చరికలు చేస్తున్నాయి. అయినా వారి మాటలను లెక్కచేయకుండా కొందరు మద్యం తాగి వాహనాలను నడుపుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కళాశాలలకు చెందిన కొందరు డ్రైవర్లు కూడా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఘటనలు మనం అనేకం చూశాం. తాజాగా అలాంటి ఘటననే ఒకటి చోటుచేసుకుంది. ఫూటుగా తాగి స్కూల్ బస్సు నడిపాడు ఓ డ్రైవర్. జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా బస్సును డ్రైవర్ చేశాడు. దీంతో విద్యార్ధులు భయందోళకు గురై పెద్ద ఎత్తున కేకలు వేయడంతో బస్ ను ఒక పక్కకి ఆపి పడిపోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
కృష్ణా జిల్లా ఉయ్యూరుకి చెందిన ఓ కార్పొరేట్ స్కూల్ బస్సు బుధవారం సాయంత్రం విద్యార్ధులను ఎక్కించుకొని బయల్దేరింది. అయితే ఆ వాహనం నడిపే వ్యక్తి అప్పటికే ఫూటూగా మద్యం తాగి ఉన్నాడు. ఇక మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై కూడా బస్సును అడ్డదిడ్డంగా నడిపాడు. దీంతో అందులో ఉన్న విద్యార్ధులు భయంతో పెద్ద ఎత్తున కేకలు వేశారు. బస్ ను ఆపాలని డ్రైవర్ కి చెప్పారు. అయినా కొంత దూరం వెళ్లిన తరువాత మత్తు ఎక్కువై.. బస్సును రహదారికి ఓ వైపున ఆపి పడుకున్నాడు. స్థానికులు వచ్చి నిలదీస్తే, కనీసం సమాధానం చెప్పకుండా, సోయి లేకుండా ఆ డ్రైవర్ పడిపోయాడు.
బస్సు నిలిపివేయడంతో విద్యార్ధులు కిందగి దిగి.. తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చీకటి పడిపోవడంతో విద్యార్ధులు భయపడిపోయారు. విద్యార్ధుల పరిస్థితి చూసిన ఇతర వాహనదారులను సదరు పాఠశాల యాజమాన్యంకి సమాచారం అందించారు. దీంతో హడావుడిగా అక్కడికి చేరుకున్న పాఠశాల యాజమాన్యం విద్యార్ధుల తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఈ ఘటనపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను వీడియో చిత్రికరిస్తున్న వారిని పాఠశాల చెందిన కొందరు అడ్డుకున్నారు. హడావుడిగా మరొక డ్రైవర్ రప్పించి.. విద్యార్ధులను వారి ఇళ్లకు పంపించారు. అయితే అప్పటికే కొంతమంది విద్యార్ధులను వారి తల్లిదండ్రులు తమ వెంట తీసుకెళ్లారు.
ఈ బస్సులో ఆడపిల్లలకు కూడా ఉన్నారని ,వారికి ఏమైనా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధుల పేరెంట్స్ ను మీడియా ప్రతినిధులతో మాట్లాడకుండా కట్టడి చేయడంపై అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి నడపడం వంటి కారణాలో ఎందరో అమాయకపు విద్యార్దులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం అనేకం చూశాం. ఇప్పటికైన విద్యాసంస్థల యజమానులు ఇలాంటి విషయాల్లో తమ సంస్థ సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించాలి.