తల్లి చనిపోతే విదేశాల నుంచి రాని వాళ్ళున్న ఈ సమాజంలో.. బతికున్న అమ్మ కోసం దుబాయ్ లో మంచి జీతం వదులుకుని ఇండియా వచ్చాడంటే నమ్ముతారా? ఓ యువకుడు తన తల్లి కోసం విదేశాల్లో జాబ్ వదిలేసి.. సొంత ఊరిలో పానీపూరి వ్యాపారం మొదలెట్టాడు. విలాసవంతమైన జీవితం చక్కటి ఉద్యోగం, మంచి సాలరీని వదిలివచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం..
తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పాలా కాపాడుకుంటారు. వారి పిల్లలు ఉన్నత స్థాయిలో ఎదిగి, మంచి ఉద్యోగం పొందాలని కోరుకుంటారు. అందుకుగాను చాలా కృషి చేస్తారు. మంచి పొజిషన్లో ఉండాలని కలలు కంటారు. వారి కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతారు. అటువంటి పేరెంట్స్ కోసం తపించే పిల్లలు కూడా ఉంటారు. వారు తల్లిదండ్రులను మలి వయస్సులో అన్ని సదుపాలయాలను సమకూర్చి బాగా చూసుకుంటారు. ఆ కోవకు చెందిన యువకుడి గురించి తెలుసుకుందాం. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని గింజేరు గ్రామానికి చెందిన వేణు దుబాయ్లో మెరైన ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ. 80 వేల సాలరీ.. ప్రేమించిన అమ్మాయినే జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. అని చెప్పుకొచ్చాడు వేణు. వేణు చెప్పిన వివరాల ప్రకారం..
తల్లి రాజేశ్వరి, తండ్రి వెంకటరావు, తమ్ముడు చంద్రశేఖర్తో చిన్న కుటుంబం వారిది. అయితే తండ్రి తాపీ మేస్త్రీ పని చేస్తుండేవారు. తమ్ముడు టూరిస్టు గైడ్గా పని చేస్తున్నాడు. తను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. దుబాయ్లోని ఎస్ఎస్ఎల్ కంపెనీలో రెండేళ్లుగా మెరైన్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. వెళ్లిన రెండు వారాలకే తన తల్లి రాజేశ్వరి అనారోగ్యం పాలైంది. ఆమెకు క్యాన్సర్ వ్యాధి సోకిందని తెలియగానే ఈ వార్తను తన కొడుకుకు చేరవేసింది. ‘నువ్వు విదేశాల్లో ఉంటే నా కడచూపు కూడా దక్కదేమో’నని తల్లి అన్న మాటలు అతని మనసును కలచివేశాయి. తల్లిని అనారోగ్య సమయంలో వదిలి ఉండలేపోయాడు వేణు. భార్యను తీసుకుని తన స్వగ్రామానికి చేరుకున్నాడు. అమ్మను బతికినంత కాలం బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
స్థానికంగా తన క్వాలిఫికేషన్ కు తగిన జాబ్ రాకపోవడంతో పానీపూరి వ్యాపారం మొదలెట్టాడు. అమ్మకు తోడుగా ఉంటూ.. తన వ్యాపారం చేసుకుంటున్నాడు. తన వ్యాపారంలో ఖర్చులు పోను మిగులు ఉంటుందని వేణు చెప్పాడు. ఉదయం పూట అమ్మను చూసుకుంటాం. ప్రతిరోజు సాయంత్రం భార్యాభర్తలు కలిసి పానీపూరి వ్యాపారం చేస్తున్నామని చెప్పాడు. తను పని చేస్తున్న కంపెనీలో అమ్మ అనారోగ్య పరిస్థితిని గురించి చెప్పి పర్మిషన్ తీసుకున్నానని అన్నాడు. తిరిగి మళ్లీ వెళితే జాబ్లో చేర్చుకుంటారని వేణు తెలిపాడు. జాబ్ వదిలేశానని బాధఏమీ లేదని.. తన తల్లిని ఈ సమయంలో చూసుకోవడానికి అవకాశం కలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నానని వేణు అంటున్నాడు. తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇంటి నుండి గెంటేసే పిల్లలున్న ఈ రోజుల్లో కూడా వేణులాంటి కొడుకు ఉండటం ఆ తల్లి చేసుకున్న పుణ్యం అనే చెప్పాలి. వేణు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది యువకులకు ఆదర్శం. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.