ప్రతీ ఏటా లాగే ఈ సంవత్సరం కూడా ప్రజలు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా మద్యం ప్రియులు తమ ఉనికిని చాటుకున్నారు. పాత రికార్డులను చెరిపి కొత్త రికార్డులను సృష్టించారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు వేల కోట్ల రూపాయలకు చేరాయి. దక్షిణ భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పటిలాగే రికార్డులను నెలకొల్పాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా 500 కోట్ల రూపాయలకు పైగా అమ్మకాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల విషయానికి వస్తే.. డిసెంబర్ 29న 72 కోట్ల రూపాయలు, డిసెంబర్ 30న 86 కోట్ల రూపాయలు, డిసెంబర్ 31న 127 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. మొత్త మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మకాలు 285.3 కోట్లుగా ఉన్నాయి. ఇక, సంక్రాంతి సందర్భంగా కూడా ఇదే విధంగా మద్యం అమ్మకాలు ఉండే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రికార్డు!
తెలుగు రాష్ట్రాల మద్యం అమ్మకాల విషయానికి వస్తే.. తెలంగాణ రికార్ట్ క్రియేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ డిసెంబర్ 31న ఎక్కువ మద్యం అమ్మకాలను సాధించింది. ఆంధ్రప్రదేశ్ 31న 127 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలకు పరిమితం కాగా, తెలంగాణ 31వ తేదీన దాదాపు ఏపీ కంటే డబుల్ అమ్మకాలను సాధించింది. ఆ ఒక్కరోజే ఏకంగా 215 కోట్ల మద్యం అమ్ముడైంది. జనవరి 1న కూడా ఇదే ఊపు కొనసాగింది. కొత్త సంవత్సరం మొదటి రోజు ఆదివారం కావటంతో మద్యం ప్రియులు పండుగ చేసుకున్నారు. మరి, మద్యం అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తున్న తెలుగు రాష్ట్రాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.