విశాఖ పట్టణం ఆర్ఐ స్వర్ణలతపై కేసు నమోదైన విషయం తెలిసిందే. విచారణలో ఆమె నిజాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.
కంచె చేను మేస్తే.. అన్న చందంగా విశాఖ పట్టణం ఆర్ఐ వ్యవహరించింది. ప్రభుత్వానికి సహకరించే డిపార్ట్మెంట్ లో ఉండి.. ఆ శాఖకే అపకీర్తి తెచ్చింది. తను ప్రవర్తించిన తీరుకు డిపార్ట్ మెంట్లోని కీలక వ్యక్తులకు కూడా దడపుట్టించేలా చేసింది. సామాన్య ప్రజల ధన, ప్రాణ రక్షణగా ఉండవలసిన రక్షక భటులే ఇలా వ్యవహరిస్తుంటే ప్రజలను ఎవరు కాపాడుతారు? ఆశలకు కూడా ఓ హద్దుంటుంది. ఆ హద్దులు దాటితే ఇలాగే అవుతుంది. ఆర్ ఐ స్వర్ణలత చేసిన ప్రభుత్వ వ్యతిరేక చర్యలకుగాను ఆమెపై వేటు పడింది. విశాఖ పట్టణం ఆర్ఐ స్వర్ణలతపై నోట్ల మార్పిడి కేసు నమోదైంది. విచారణలో స్వర్ణలత లీలలు వెలుగులోకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. చివరకు తను డబ్బులకు ఆశపడి తప్పు చేశానని స్వర్ణలత ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. మరిన్ని పూర్తి వివరాల్లోకి వెళితే..
నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలిగా ఉన్న ఆమెకు ఒకరోజు పోలీసు కస్టడీ ముగిసింది. శుక్రవారం ఉదయం స్వర్ణలతను కేజీహెచ్కు తరలించి, వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు పంపించారు. క్రైమ్ డీసీపీ నాగన్నతోపాటు ఏసీపీ, ముగ్గురు ఇన్పెక్టర్లు, మహిళా సిబ్బంది ఆమెను గురువారం జైలునుంచి తీసుకొచ్చి ఎంవీపీకాలనీ పోలీసు స్టేషన్ లో విచారణ జరిపారు. ఈ విచారణ అనంతరం వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ముందు ఆమె విచారణకు పూర్తిగా సహకరించలేదు. పోలీసు అధికారులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా లాభంలేకపోయింది. ఆమెకు పోలీసులు గట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. దీంతో స్వర్ణలత నిజం ఒప్పుకుంది.
పట్టణంలో ఓ నేత వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను త్వరగా మార్పిస్తే 10 శాతం కమీషన్ వస్తుందని మరో వ్యక్తి ద్వారా తెలుసుకుని ఈ వ్యవహారం నడిపినట్లు తెలిపింది. తన డ్రైవర్ ఒత్తిడి వల్లనే డబ్బులకు ఆశపడి ఈ పని చేశానని ఒప్పుకుంది స్వర్ణలత. అయితే నగదు మార్పిడికి సంబంధించి రూ.2వేల నోట్లు తీసుకెళ్లలేదని.. అవతల వ్యక్తుల నుంచి రూ.500 నోట్లను తీసుకువచ్చారని ఆమె తెలిపింది. ఇంకా మరిన్ని విషయాలపై ఆరా తీశారు. తన సినిమా షూటింగ్ నిమిత్తం వీడియోలను గురించి కూడ విచారించారు.