గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లాలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని చిన్న కొత్తపల్లి మండలం వెల్దూర్తి సమీపంలోని చిత్రావతి నదిలో కారు, ఆటో చిక్కుకున్నాయి. ఆ వాహనాల్లో ఉన్న పది మంది నదిలో ఉండిపోయారు. కారులోని నలుగురిని పోలీసులు రక్షించారు. ఆటోలో ఉన్న ఆరు మంది రక్షించేందుకు నదిలోకి జేసీబీని పంపించారు అధికారులు.
అప్పటికే వరద ఉద్దృతి ఎక్కవ కావడంతో ఆరుగురితో ఉన్న జేసీబీ కూడా పూర్తి స్థాయిలో నదిలో చిక్కుకుంది. కాపాడటానికి వెళ్లిన జేసీబీలోని నలుగురు, ఆటోలోని ఆరుగురు నదిలో ఉండిపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు కరెంట్ ను నిలిపివేశారు. ఉద్ధృతి అంతకంతకు అధికమవు తుండడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.
రాప్తాడు శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న సీఎం జగన్ కు దీనిపై సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఎం జగన్ అనంతపురం జిల్లాకు ఓ హెలికాప్టర్ పంపించాలని అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్ రావడంతో చిత్రావతి నదిలో చిక్కుకుపోయిన 10 మందిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.