వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడిని దేవుడిగా భావిస్తారు. కానీ, కొన్ని ఆస్పత్రులు, వాటి యాజమాన్యాలు మాత్రం డబ్బు సంపాదన ప్రధాన ధ్యేయంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. చిరంజీవి సినిమాలో బిల్లు కట్టిన తర్వాత మీ భార్య చనిపోయింది అని చెప్పినట్లు.. రియల్ లైఫ్ లో కూడా అలాంటి ఒక ఘటన జరిగింది. అప్పటి వరకు బాబుకు వైద్యం చేస్తున్నాం.. పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పారు. వైద్యం కోసం రూ.3.14 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో కుటుంబం ఆ డబ్బు కట్టింది. తర్వాత వైద్యులు బాబు శవాన్ని అప్పగించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
బాధితుల ఆరోపిస్తున్న ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంకు చెందిన సాలాపు మహారాజుకు రెండేళ్ల ధాన్విక్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ బాబుకు దగ్గు, జ్వరం ఉండగా విశాఖ శాంతినగర్ లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి గురువారం తీసుకెళ్లాడు. ధాన్విక్ కు ఆస్పత్రి వైద్యులు గురువారం, శుక్రవారం వైద్యం అందించారు. డయాలసిస్ కూడా చేశారని పిల్లాడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని ధాన్విక్ మేనమామ వెల్లడించాడు.
రూ.3.14 లక్షలు బిల్లు కట్టేసి.. కేజీహెచ్ కు తరలించారని చెప్పారట. అయితే అప్పు చేసిమరీ ధాన్విక్ కుటుంబం బిల్లును చెల్లించారు. 108 వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారట.. పిల్లాడిని కేజీహెచ్ కి తరలించేందుకు. అయితే బిల్లు కట్టిన తర్వాత కాసేపటికి వైద్యులు వచ్చి పిల్లాడు చనిపోయినట్లు చెప్పారట. వైద్యులు చెప్పిన మాటకు వారంతా షాక్ లో ఉండిపోయారు. వైద్యులు చెప్పిన మాటను కుటుంబం నమ్మలేకపోయింది. మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించాలని చెప్పిన వైద్యులు.. ఇప్పుడు చనిపోయడనగానే నమ్మలేకపోయారు.
డబ్బు కోసం తమని మోసం చేశారంటూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న త్రీ టౌన్ సీఐ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. న్యూమోనియా, కార్డిక్ అరెస్ట్ తో బాధపడుతున్న చిన్నారిని ఆస్పత్రిలో చేర్చారని.. తాము కరెక్ట్ గానే వైద్యం చేశామంటూ సిబ్బంది వెల్లడించారు. వైద్యం జరుగుతున్న సమయంలో అసలు ఏం జరుగుతోంది? పిల్లాడి పరిస్థితి ఏంటని తెలియనివ్వకుండా గుట్టుగా ఉంచారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.