ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై మద్యం మత్తులో పలువురు దాడికి పాల్పడ్డారు. అతనికి తీవ్ర గాయాలైనా కూడా వదలకుండా నోట్లో మూత్రం పోస్తూ.. విచక్షణారహితంగా ప్రవర్తించారు.
స్నేహం పేరుతో కొందరు అకృత్యాలకు పాల్పడుతున్నారు. తమతో నిత్యం తిరిగే స్నేహితులను చెడు సావాసాలకు లోను చేస్తూ.. వారి జీవితాలను గందరగోళంలో పడేస్తున్నారు. కలిసి తిరిగేరోజుల్లో బాగానే ఉంటారు. ఏదైనా తేడా వస్తే మాత్రం రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. వారి పైశాచికత్వానికి మనుషులను బలితీసుకుంటున్నారు. చెడు స్నేహం జీవితాలను అయోమయంలోకి నెట్టేస్తుంది. తాగిన మైకంలో ఏం చేసేది కూడా తెలియడం లేదు. ఇటీవల మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి గిరిజన యువకుడిపై మూత్రవిసర్జన చేసిన సంఘటన మరువకముందే ఒంగోలులో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై మద్యం మత్తులో పలువురు దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అతడి నోట్లో మూత్రం పోస్తూ వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మోటా నవీన్, మన్నె రామాంజనేయులు(అంజి) చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరు చెడు తిరుగుళ్లు తిరుగుతూ నేరాలకు పాల్పడేవారు. వీరిపై దాదాపు 50 దొంగతనం కేసులు ఉన్నాయి. నవీన్ పోలీసులకు పట్టుబడి శిక్ష అనుభవించాడు. రామాంజనేయులు తప్పించుకుని తిరుగుతున్నాడు. కొంతకాలంగా వీరిమధ్య విబేధాలు నెలకొన్నాయి. అంజి ఓ పథకం ప్రకారం నెల రోజుల క్రితం మద్యం తాగడానికి నవీన్ ని పిలిచి ఒంగోలులోని కిమ్స్ ఆస్పత్రికి బ్యాక్ సైడ్ తీసుకెళ్లాడు. అక్కడ మరో 9 మంది యువకులు ఉన్నారు. అందరు కలిసి మద్యం తాగి.. నవీన్ తో పాత వివాదంపై మాట్లాడే క్రమంలో మాటామాటా పెరిగి దాడికి పాల్పడ్డారు. నవీన్పై మూకుమ్మడిగా దాడిచేశారు. తీవ్ర గాయాలతో బాధితుడు బతిమాలుకున్నా వినకుండా అతనిపై విచక్షణారహితంగా దాడిచేశారు. నవీన్కు తీవ్ర గాయాలై రక్తమోడుతున్నా వదలకుండా కొట్టారు.
అంతేకాకుండా బాధితుడి నోట్లో మూత్రం పోస్తూ.. తాగాలని బలవంతం చేశారు. ఈ దారుణాన్ని సెల్ ఫోన్లో వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెల రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై ఇప్పటికే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేవలం దాడి, ఎస్సీ, ఎస్టీ కేసుగా నమోదు చేసి వదిలేశారు. నిందితుల విచారణ, అరెస్ట్లకు ప్రయత్నించలేదు. తాజాగా కొందరు సామాజిక మాధ్యమాల్లో వీడియో షేర్ చేయగా ఈ విషయం పోలీసుల పైఅధికారుల వరకు వెళ్లింది. పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా మిగతా వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.