చిత్తూరు జిల్లా మదనపల్లి – పలమనేరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ ముందు వెళ్తున్న పోలీసు వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. పెద్దపంజని మండల కేంద్రం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అదే సమయంలో ద్విచక్ర వాహనం వెనుక టమాటా లోడ్ తో వస్తున్న టాటా ఏసీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలోని డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో పోలీసు వాహనంలోని డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. కాన్వాయ్ వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనం వస్తుండడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనం దిగి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు.